ఐటీ దాడులపై స్పందించిన సోనూసూద్..!
ప్రముఖ బాలీవడ్ నటుడు సోనూసూద్ ఇళ్లపై ఆదాయపు పన్నుశాఖ దాడులు జరిగిన విషయం తెలిసిందే.ముంబయిలోని ఆయన నివాసంతోపాటు.. నాగ్పూర్, జైపుర్లలో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. సోనూ సూద్ ఛారిటీ ఫౌండేషన్ బ్యాంకు ఖాతాలను కూడా పరిశీలించారు. సోనూసూద్ రూ. 20 కోట్ల మేరకు పన్ను ఎగ్గొట్టినట్లు తెలిపింది. సోనూసూద్ కరోనా కాలంలో విదేశాల నుంచి నిబంధనలకు విరుద్ధంగా 2 కోట్ల 10 లక్షల రూపాయల విరాళాలు సేకరించారని ఐటీ అధికారులు తేల్చిచెప్పారు. దాదాపు 4 రోజుల పాటు ఐటీ అధికారులు సోనూసూద్ను ప్రశ్నించారు. తాజాగా సోనూసూద్ తనపై జరిగిన దాడులకు సంబంధించి ట్విట్టర్ ద్వారా స్పందించారు. నా ఫౌండేషన్లో ప్రతి రూపాయి కూడా నిరుపేదల జీవితాల కోసం పోగు చేసిందేనని ట్వీట్ చేశారు. ‘ప్రతి భారతీయుని ప్రార్థనల ప్రభావం ఎంతలా ఉంటుందంటే… అధ్వాన్నంగా ఉన్న రోడ్లలో కూడా ప్రయాణం అత్యంత సులభమవుతుంది’ అని పేర్కొన్నారు. అలాగే ‘ నీలోని నిజాయితీ గాథను నువ్వు చెప్పుకోనక్కరలేదు. కాలమే వెల్లడిస్తుంది. దేశంలోని ప్రజలకు సేవ చేయడానికి కట్టుబడి ఉన్నాను. అదే నాకు బలాన్నిస్తుంది. నా జర్నీ ఇలాగే కొనసాగుతుంటుంది.మానవతా కారణాలతో కొన్ని బ్రాండ్లను సైతం ప్రోత్సహించాను. నాలుగు రోజులుగా నేను నా అతిథులు( ఐటీ అధికారులు)తో బిజీగా ఉన్నాను. ఆ కారణం వల్లనే మీ సేవలో ఉండలేకపోయాను. మళ్లీ సేవలందించేందుకు ఇప్పుడు మీ ముందుకు వచ్చేశాను. అంటూ తన ట్వీట్లో పేర్కొన్నారు