సమాఖ్య ప్రజాస్వామిక వ్యవస్థలో రాష్ట్రాల పాత్రకు చాలా ప్రాధాన్యం ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు.. 82వ ఆలిండియా ప్రిసైడిరగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ సిమ్లాలో బుధవారం ప్రారంభమైంది. ఈ సమావేశంలో మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్య్రం వచ్చి 100 ఏళ్ళు పూర్తి కాబోతున్న తరుణంలో అంతకుముందు రానున్న 25 సంవత్సరాల్లో ప్రతి వ్యక్తి తన కర్తవ్యాన్ని నిర్వహించడమే ఓ మంత్రమని, ఇది దేశాభివృద్ధికి దోహదపడుతుందన్నారు. ఈ సందేశం పార్లమెంటు, రాష్ట్రాల శాసన సభల నుంచి వెలువడాలని చెప్పారు. దేశ ఐకమత్యం, సమగ్రతలకు విఘాతం కలిగించే చర్యల పట్ల చట్ట సభలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. చట్ట సభల సభ్యుల ప్రవర్తన భారతీయ విలువలకు అనుగుణంగా ఉండాలని, ఇతరులపై రాజకీయపరమైన అనుచిత వ్యాఖ్యలు లేకుండా, శ్రద్ధగా, హుందాతనంతో చట్టసభల్లో నాణ్యమైన, ఆరోగ్యకరమైన చర్చల కోసం ప్రత్యేక సమయం కేటాయించాలని అన్నారు.