విచారణ కమిటీ ఏర్పాటు చేసిన పంజాబ్ ప్రభుత్వం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతా లోపంపై న్యాయవాది మణిందర్ సింగ్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. సెక్యూరిటీ రీజన్స్తో మోడీ పర్యటన రద్దవడం సంచలనంగా మారింది. పీఎం కాన్వాయి 20నిమిషాల పాటు ఫ్లై ఓవర్పై నిలిచిపోవడం వెనుక అసలేం జరిగింది..? అడుగడుగునా పహారా.. డేగ కళ్ల నిఘా మధ్య సాగే ప్రధాని పర్యటనలో ఇంతటి భద్రతా వైఫల్యానికి కారణం ఎవరో తేల్చాలని అత్యున్నతస్థాయి విచారణ జరపాలని పిటిషనర్ కోరారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం ఉదయం విచారణ జరపనుంది.పిటిషన్పై సమాధానమివ్వాలని కేంద్రంతో పాటు పంజాబ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. మరోవైపు పంజాబ్ ప్రభుత్వం ప్రధాని పర్యటనలో భద్రతా వైఫల్యంపై ముగ్గురు సభ్యులతో హై లెవెల్ కమిటీని ఏర్పాటుచేసింది. మూడ్రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని సీఎం ఛన్నీ ఆదేశించారు.ప్రధాని మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతా వైఫల్యం తీవ్ర కలకలం సృష్టించింది. ఫిరోజ్పూర్ జిల్లాలో నిరసనకారులు రహదారిని నిర్బంధించడంతో ప్రధాని కాన్వాయి 15`20నిమిషాల పాటు ఫ్లై ఓవర్పై చిక్కుకుపోయారు. దీంతో తన పర్యటనను అర్ధంతరంగా ముగించుకుని దిల్లీ వెళ్లిపోయారు. ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ తీవ్రంగా స్పందించింది. తక్షణమే నివేదిక సమర్పించాలని పంజాబ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరోవైపు ఈ ఘటన నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీజేపీ, కాంగ్రెస్ల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.