Friday, April 19, 2024
Friday, April 19, 2024

ప్రధాని మోదీ పర్యటనలో భద్రతా వైఫల్యం.. దర్యాప్తునకు స్వతంత్ర కమిటీ ఏర్పాటు


పధాని నరేంద్ర మోదీ పంజాబ్‌ పర్యటనలో భద్రతా వైఫల్యానికి సంబంధించి దాఖలైన అభ్యర్థనపై సుప్రీంకోర్టు నేడు విచారణ జరిపింది. ఈ ఘటనపై స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌.ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం వెల్లడిరచింది. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో ఈ కమిటీ ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలిపింది. డిజిపి చండీగఢ్‌, ఐజి నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ, పంజాబ్‌ అండ్‌ హర్యానా హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌, ఎడిజిపి (సెక్యూరిటీ) పంజాబ్‌లను కమిటీలో సభ్యులుగా చేర్చాలని సుప్రీంకోర్టు ప్రతిపాదించింది. విచారణ సందర్భంగా, ప్రధాని మోడీ రోడ్డు ప్రయాణం గురించి పంజాబ్‌ ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ ప్రభుత్వానికి ముందే తెలుసునని కేంద్ర ప్రభుత్వం తరపున న్యాయవాది సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా కోర్టుకు వివరించారు. ప్రధానమంత్రి భద్రతకు సంబంధించి ఎస్‌పిజి చట్టం గురించి సమాచారం అందించారు. అలాగే, భద్రతకు సంబంధించి బ్లూ బుక్‌లో ఇచ్చిన సమాచారాన్ని గుర్తు చేశారు. ఈ మొత్తం ప్రక్రియను అనుసరించడంలో పొరపాటు జరిగిందనడంలో సందేహం లేదు. దీనిపై ఎలాంటి వివాదం ఉండకూడదు. భద్రతా లోపం, నిర్లక్ష్యాన్ని కొట్టిపారేయలేం. డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ పర్యవేక్షణలో స్థానిక పోలీసులే భద్రతా ఏర్పాట్లు చేస్తారని ‘బ్లూ బుక్‌’లో స్పష్టంగా ఉందని తుషార మెహతా సుప్రీం ధర్మాసనానికి నివేదించారు. గత వారం పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌ జిల్లాకు ప్రధాని మోదీ వెళుతుండగా ఆందోళనకారులు రహదారిని దిగ్బంధించడంతో ఆయన వాహనశ్రేణి 20 నిముషాలపాటు ఫ్లైఓవర్‌పై చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన బహిరంగ సభ సహా వివిధ కార్యక్రమాల్లో పాల్గొనకుండానే వెనుదిరిగారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img