Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ప్రపంచంలోనే పొడవైన రివర్‌ క్రూయిజ్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ..

విలాసవంతమైన క్రూయిజ్‌ని వర్చువల్‌ మోడ్‌లో ప్రధాని మోదీ ప్రారంభించారు. ప్రపంచంలోనే అత్యంత పొడవైన రివర్‌ క్రూయిజ్‌ (ఓడ)ని ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో గంగానదిపై మోదీ ప్రారంభించారు. ఈ క్రూయిజ్‌ వారణాసి నుంచి భారత్‌, బంగ్లాదేశ్‌లోని ఐదు రాష్ట్రాల్లోని 27 నదీ వ్యవస్థల మీదుగా 3,200 కి.మీ కంటే ఎక్కువ దూరాన్ని కవర్‌ చేస్తుంది. రవిదాస్‌ ఘాట్‌ నుంచి 31 మంది ప్రయాణికులతో 50 ప్రదేశాలలో 51 గంటల తొలి ప్రయాణాన్ని ప్రారంభించనుంది. ఈ క్రూయిజ్‌ పేరు ఎంవీ గంగా విలాస్‌. ఇందులో మూడు డెక్‌లు, 36 మంది ప్రయాణికులకు అన్ని రకాల సౌకర్యాలు కలిగిన 18 సూట్‌లు ఉన్నాయి. క్రూయిజ్‌లో జిమ్‌, స్పా సెంటర్‌, లైబ్రరీ, ఇతర సౌకర్యాలు కూడా ఉన్నాయి. మొదటి ప్రయాణంలో స్విట్జర్లాండ్‌, జర్మనీ నుంచి 31 మంది ప్రయాణికుల బృందం క్రూయిజ్‌ ఎక్కింది. ఓడలోని 40 మంది సిబ్బందితో ప్రయాణాన్ని ప్రారంభించనుంది. క్రూయిజ్‌ షిప్‌ ఛైర్మన్‌ రాజ్‌ సింగ్‌ ఈ క్రూయిజ్‌ 27 నదీ వ్యవస్థల గుండా వెళుతుందని, బంగ్లాదేశ్‌తో కనెక్టివిటీని మెరుగుపరుస్తుందని చెప్పారు. ప్రధాని దార్శనికత వల్లే ఇదంతా సాధ్యమైందని కేంద్ర మంత్రి సర్వానంద సోనోవాల్‌ అన్నారు. ప్రభుత్వ-ప్రైవేట్‌ భాగస్వామ్యం (పీపీపీ) మోడల్‌లో భాగంగా ఈ గంగా విలాస్‌ పర్యాటక రంగం వృద్ధికి తోడ్పడనుంది. వారణాసిలోని ప్రసిద్ధ ‘గంగా ఆరతి’తో పాటు బౌద్ధమతానికి ప్రసిద్ధి చెందిన సారనాథ్‌ వద్ద ఆగుతుంది. తాంత్రిక కళలకు ప్రసిద్ధి చెందిన మయోంగ్‌, అస్సాంలోని అతిపెద్ద నదీ ద్వీపం, వైష్ణవ సంస్కృతికి కేంద్రంగా ఉన్న మజులి మీదుగా వెళ్తుంది. యాత్రికులు బీహార్‌ స్కూల్‌ ఆఫ్‌ యోగా, విక్రమశిల విశ్వవిద్యాలయాన్ని కూడా సందర్శిస్తారు. ఈ క్రూయిజ్‌ రాయల్‌ బెంగాల్‌ టైగర్స్‌కు ప్రసిద్ధి చెందిన బంగాళాఖాతం డెల్టాలోని సుందర్‌బన్స్‌, ఖడ్గమృగాలకు ప్రసిద్ధి చెందిన కాజిరంగా నేషనల్‌ పార్క్‌ మీదుగా కూడా ప్రయాణిస్తుంది. ఇలా ఎన్నో ప్రత్యేకతలు ఈ క్రూయిజ్‌ లో ఉన్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img