వెంటనే ఉపాధి బకాయిలు ఇవ్వాలి
సచివాలయాల ఎదుట వ్యవసాయ కార్మికుల ధర్నాలు
అమరావతి : పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో ప్రభుత్వమే నాణ్యమైన పక్కా గృహాలు నిర్మించి ఇవ్వాలని, కోనేరు రంగారావు భూకమిటీ సిఫారసులను నవరత్నాల్లో చేర్చి, పేదలకు సాగుభూములు ఇవ్వాలని డిమాండు చేస్తూ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం(బీకేఎంయూ) అధ్వ ర్యంలో సోమవారం రాష్ట్రవ్యాప్తంగా గ్రామ సచివాలయాల ముందు ధర్నాలు, ప్రదర్శనలు నిర్వహించారు. వ్యవసాయ కూలీలు, పేదలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ఎలాంటి నిబంధనలు లేకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయాలని, ఉపాధిహామీ కూలీలకు వేతన బకాయిలు వెంటనే ఇవ్వాలని, వ్యవసాయంలో యంత్రాలను నియంత్రించి, వ్యవసాయ కార్మికులతో పనులు చేయించేలా చర్యలు తీసుకోవాలని, న్యాయమైన కూలి రేట్లు ఇవ్వాలని నినదించారు. వలసలను ఆపేలా ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకోవాలని డిమాండు చేశారు. కర్నూలు జిల్లా డోన్ మండలం ఉడుములపాడులో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్, జిల్లా కార్యదర్శి కె.రాధాకృష్ణ, మద్దికెర మండలం పెరవలిలో కర్నూలు జిల్లా అధ్యక్షుడు నబీ రసూల్ అధ్వర్యంలో ధర్నా జరిగింది. ఆవుల శేఖర్ మాట్లాడుతూ వ్యవసాయ కార్మికులకు న్యాయమైన కూలీ ఇవ్వాలని, వలసలు నియంత్రించాలన్నారు. అనంతపురంలో బి.కేశవరెడ్డి, పెద్దయ్య, రంగయ్య, కడపలో సి.సుబ్రహ్మణ్యం, చిత్తూరులో పెంచలయ్య, కిష్టప్ప, నెల్లూరులో బాలకృష్ణ, దుర్గాబాబు, ఒంగోలులో ఆర్.వెంకట్రావు, మౌలాలి, గుంటూరులో ఈశ్వరరావు, పశ్చిమ గోదావరిలో బండి వెంకటేశ్వరరావు, వసంతరావు, కలిశెట్టి వెంకట్రావు అధ్వర్యంలో ధర్నా చేపట్టారు. విశాఖపట్నంలో దొరబాబు, కొండలరావు, తాతబ్బాయి, విజయనగరంలో ఆనందరావు, సూరయ్య, శ్రీకాకుళంలో చాపర సుందర్లాల్, లండ వెంకట్రావు నాయకత్వంలో ధర్నాలు, ప్రదర్శనలు జరిగాయి.