. కర్ణాటక ఎన్నికల్లో లబ్ధికే ఎగువ భద్రకు నిధులు
. వైసీపీ పాలనలో ఒక్క ప్రాజెక్టూ పూర్తికాలేదు
. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
విశాలాంధ్ర బ్యూరో- తిరుపతి : రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులు నిర్వీర్యం అవుతున్నాయని, ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేసేలా ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చేందుకు సుదీర్ఘ పోరాటం చేస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. సీపీఐ రాష్ట్ర బృందం చేపట్టిన ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా నాలుగవ రోజు తిరుపతికి చేరుకున్నది. తిరుపతి బైరాగి పట్టెడ నుంచి కరకంబాడి సమీపంలోని తారకరామా నగర్ వరకు పార్టీ కార్యకర్తలు భారీ స్కూటర్ ర్యాలీ నిర్వహించారు. రేణిగుంట వద్ద బాణసంచా పేల్చి పూల వర్షం కురిపించి రామకృష్ణ, కార్యదర్శివర్గ సభ్యులు హరినాథరెడ్డి, జగదీశ్కు ఘన స్వాగతం పలికారు. తారకరామా నగర్ వద్ద ఉన్న గాలేరు నగరి సుజల స్రవంతి శిలాఫలకాన్ని పరిశీలించారు, అనంతరం మల్లెమడుగు, బాలాజీ రిజర్వాయర్ను సందర్శించారు. తెలుగుగంగ ప్రాజెక్టు ఇంజినీరింగ్ అధికారులను కలిసి ప్రాజెక్టు పనుల గురించి ఆరా తీశారు. అనంతరం రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో ఒక్క ప్రాజెక్టు అయినా కట్టారా..ఒక్క కాలువైనా నిర్మించారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలోని పెండిరగ్ ప్రాజెక్టులు, పంట కాలువలకు రానున్న బడ్జెట్లో నిధులు కేటాయించి పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 13వ తేదీ నుంచి 22వ తేదీ వరకు రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నీ పరిశీలించనున్నట్లు తెలిపారు. ప్రాజెక్టులన్నీ పరిశీలించాక నివేదిక రూపొందిస్తామన్నారు. విజయవాడలో ఇరిగేషన్ ఇంజినీర్లు, మేధావులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తామన్నారు. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి షేకావత్ను కలిసి రాష్ట్రంలో నీటి ప్రాజెక్టులు సత్వరం పూర్తి చేయాలని విన్నవిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి హరినాథరెడ్డి, జగదీశ్, కార్యవర్గ సభ్యులు జయలక్ష్మి, తిరుపతి జిల్లా కార్యదర్శి మురళి, చిత్తూరు జిల్లా కార్యదర్శి నాగరాజన్, తిరుపతి జిల్లా కార్యవర్గ సభ్యులు రాధాకృష్ణ, విశ్వనాథ్, కుమార్ రెడ్డి, రామచంద్రయ్య, నదియా, గురవయ్య, ఉదయ్, కత్తి రవి వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.