పక్షం రోజులుగా నీటి పరీక్షలు బంద్
సిబ్బందికి 15 నెలలుగా నిలిచిన వేతన చెల్లింపులు
సమ్మె చేస్తున్నా పట్టించుకోని అధికార యంత్రాంగం
ఏలూరు ఘటనలు పునరావృతమైతే భారీ మూల్యం తప్పదు
రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. అత్యంత కీలకమైన తాగునీటి పరీక్షలు రాష్ట్రవ్యాప్తంగా నిలిచిపోయి 15 రోజులు దాటుతున్నా అధికార యంత్రాంగానికి చీమకుట్టినట్లు లేకపోవడం బాధాకరం. ఏడాది క్రితం ఏలూరు పట్టణంలో కలుషిత నీరు కారణంగా దాదాపు 450 మంది ప్రజలు అస్వస్థతకు గురికాగా, కొందరు మరణించిన విషయం తెల్సిందే. అప్పట్లో ఈ ఘటన రాష్ట్ర ప్రజలందర్నీ భయభ్రాంతులకు గురిచేసింది. తొలుత ఇదొక వింతరోగంగా ప్రచారం జరిగింది. అధికారులకు సైతం అంతుచిక్కకపోవడంతో దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర దర్యాప్తునకు ఆదేశించింది. చివరకు గోదావరి కాలువల నీరు కలుషితం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తేల్చారు. కూడా జిల్లానుంచి రాష్ట్రస్థాయి అధికారుల వరకు అందరికీ అనేక విజ్ఞప్తులు చేసినా స్పందించకపోవడం వల్లే అక్టోబరు 1వ తేదీ నుంచి ప్రయోగశాలలకు తప్పనిసరి పరిస్థితుల్లో తాళాలు వేశారు. నిరంతరం జరగాల్సిన నీటి పరీక్షలు నిలచిపోయినా అధికార యంత్రాంగంలో కనీస స్పందన లేకపోవడం ప్రజారోగ్యం పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనంగా పేర్కొనవచ్చు.
అధికారులు, పాలకుల నిర్లక్ష్యమే కారణం
నీటి ప్రయోగశాలల్లో పనిచేస్తున్న పొరుగుసేవల సిబ్బంది జీతాలు ఆలస్యం కావడానికి అధికారుల అలసత్వం, పాలకుల నిర్లక్ష్యమే కారణం. ప్రయోగశాలల నిర్వహణతోపాటు వీటిలో పొరుగు సేవల కింద పనిచేస్తున్న సిబ్బంది వేతనాల కోసం జలజీవన్ మిషన్ నిధుల్లో రెండు శాతం కేటాయిస్తున్నారు. ఇందుకోసం మిషన్కు కేంద్ర ప్రభుత్వం 60శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40శాతం నిధులు సమకూరుస్తున్నాయి. పొరుగుసేవల సిబ్బంది జీతాల చెల్లింపును ప్రతి మూడు నెలలకొకసారి సీఎఫ్ఎంఎస్ వెబ్సైట్లో జిల్లాలస్థాయిలో అప్లోడ్ చేయాలి. ఈ వార్షిక సంవత్సరానికి సంబంధించి వారి జీతాల బిల్లులు అప్లోడ్ చేయడంలో ఫస్ట్ తారీకు జీతం రాకపోతే గగ్గోలు పెట్టే పర్మినెంట్ ఉద్యోగులు, అధికారులు పట్టించుకోలేదు. విచిత్రమేమిటంటే పొరుగు సేవల సిబ్బంది పెండిరగ్ జీతాల కోసం ఈ ఏడాది మార్చి 23లోగా విధిగా బిల్లులు అప్లోడ్ చేయాలని ఆర్థికశాఖ సూచనలు చేసినప్పటికీ ఏడెనిమిది జిల్లాల్లో గడువులోగా ఈ ప్రక్రియ పూర్తి చేయలేదు. ఫలితంగా సిబ్బంది జీతాలు, నిర్వహణ ఖర్చులకు సంబంధించి ఇప్పటికీ ఆర్థికశాఖ నుంచి పరిపాలనా అనుమతులు రాలేదు. ఈ నేపథ్యంలోనే సమ్మెకు దిగాల్సి వచ్చిందని పొరుగు సేవల సిబ్బంది చెపుతున్నారు. ఒకపక్క వేతనాల్లేక తమ కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతుండగా, మరోపక్క నీటి పరీక్షలు నిలిచిపోవడం వల్ల ప్రజల ప్రాణాలకు ఎక్కడ ముప్పు వాటిల్లుతుందోనని ఆందోళన చెందుతున్నామని అంటున్నారు. సమస్య తీవ్రతను ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్కు లేఖల ద్వారా తెలియజేశామని, ఇకనైనా పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.