14 ఏళ్లుగా కానరాని సిమెంటు పరిశ్రమ
ఫ్యాక్టరీ కట్టరు.. సాగు చేయనివ్వరు
ఉపాధి లేక వీధినపడ్డ రైతన్నలు
విశాలాంధ్ర-కొలిమిగుండ్ల : కార్పొరేట్ మాయమాటలకు రైతన్నలు దగా పడుతున్నారు. పరిశ్రమలు వస్తే గ్రామాల అభివృద్ధితో పాటు తమ బతుకులు బాగుపడతాయని ఆశపడ్డారు. తరాలుగా భూములను నమ్ముకొని ఆధారపడి జీవిస్తున్న అన్నదాత కుటుంబాలు నేడు ఉపాధికోసం వెంపర్లా డాల్సిన పరిస్థితి ఏర్పడిరది. పారిశ్రామిక వేత్తలు చెప్పే మాయమాటలను ఉపాధినిచ్చే పచ్చని సాగు పొలాలను అప్పనంగా అప్పజెప్పాల్సి వచ్చింది. సిమెంట్ పరిశ్రమ వస్తే తమ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగంతో పాటు ఉపాధి దొరికి తమ బతుకులు బాగుపడతాయన్న రైతన్న ఆశలు అడియాశలు అయ్యాయి. పరిశ్రమ రాకపోగా తాము కోల్పోయిన భూముల్లో కనీసం సాగుకు కూడా అనుమతించకపోవడంతో తాము దగాపడ్డ విషయం రైతన్నలకు అప్పుడు తేటతెల్లమయింది. సారవంతమైన పచ్చని పొలాలు ముళ్ల పొదల మయమయ్యాయి. పరిశ్రమను ఏర్పాటు చేస్తామని రైతుల నుంచి భూములు తీసుకున్నట్లు నమ్మించి మోసం చేసిన పారిశ్రామిక వేత్తల తీరుపై రైతన్నలు మండిపడుతున్నారు. తాము కోల్పోయిన భూముల్లో సాగుకు అనుమతించకపోవడంతో రైతన్నలు ఉపాధి లేక ఇతర గ్రామాలకు వెళ్లి పొలాలను కౌలుకు తీసుకొని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇల్లు తప్పసెంటు భూమి లేని బాధిత రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు.
కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలంలోని కోటపాడు గ్రామ పరిధిలో ప్రిజం యాజమాన్యం సిమెంట్ పరిశ్రమను ఏర్పాటు చేస్తామని కోటపాడు, కల్వటల గ్రామ పరిధిలోని సాగు భూములను రైతుల నుంచి కొనుగోలు చేసింది. 2006-07లో పై రెండు గ్రామాల్లో రైతుల నుంచి 2500 ఎకరాల సాగు భూములు,1100 ఎకరాలు ప్రభుత్వ భూములను ప్రిజం యజమాన్యం కొనుగోలు చేసింది. మెట్ట భూమి ఎకరం రెండున్నర లక్ష, బోరు కింద ఎకరం మూడు లక్షలతో తీసుకుంది. కోటపాడు, కల్వటాల మధ్య కోటపాడు గ్రామ పరిధిలో పరిశ్రమను ఏర్పాటు చేస్తామని యాజమాన్యం చెప్పింది. నాటి నుంచి నేటికీ పరిశ్రమ ఏర్పాటు ఊసే లేకపోవడంతోఎక్కువ భూములు కోల్పోయిన కోటపాడు బాధిత రైతులు గతంలో తమ భూముల్లో సాగు చేసేందుకు ప్రయత్నించారు.
సాగు యత్నంలో భాగంగా భూముల్లోని కంప చెట్లను తొలగిస్తున్న రైతన్నపై యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు రైతులపై కేసులు నమోదు చేశారు. నేటికి అన్నదాతలు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. యజమాన్యం మాట తప్పి పరిశ్రమ ఏర్పాటు చేయకపోవడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో అన్నదాతలు ఉపాధి కోసం తాము కోల్పోయిన భూముల్లో సాగు యత్నం చేస్తే నిర్దాక్ష్యణ్యంగా వ్యవహరించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. వీధిలో పడ్డ రైతన్నలు కార్పొరేట్ మాయలోపడి భూములు కోల్పోయిన విషయం ఆలస్యంగా తెలుసుకున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ప్రిజం తీసుకున్న భూములకు సంబంధించి లీజు గడువు ముగియడంతో ఆరునెలల కిందట యాజమాన్యం ప్రజాభిప్రాయ సేకరణ జరిపి మరోసారి లీజు గడువును పొడిగించుకుంది. పరిశ్రమను వీలైంతన త్వరలో ఏర్పాటు చేస్తామని ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, వందలాది ప్రజలు, బాధిత రైతుల సమక్షంలో మళ్లీ మాయమాటలు చెప్పి, హామీలు గుప్పించింది. పరిశ్రమలు ఏర్పాటు చేయకుంటే ప్రభుత్వం రంగంలోకి దిగి భూములు కోల్పోయిన రైతులకు భూములు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.