బిల్కిస్ బానో అత్యాచార ఘటనలో 11 మంది దోషులను విడుదల చేయడం పట్ల సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ విషయంలో గుజరాత్ , కేంద్ర ప్రభుత్వాలకు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం నోటీసులు జారీచేసింది. బిల్కిస్ బానో కేసులో దోషులను విడుదల చేయడం పట్ల దేశవ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తం చేస్తోన్న విషయం తెలిసిందే. విడుదలైన తర్వాత దోషులకు సన్మానాలు, సత్కారాలు చేయడం పట్ల విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో దోషుల విడుదలను నిరసిస్తూ సీపీఐ పొలిట్బ్యూరో సభ్యురాలు సుభాషిణి అలీ , తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మెయిత్రా సహ పలువురు మహిళ హక్కుల కార్యకర్తలు దాఖలు చేసిన పిటిషన్లపై గురువారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా గుజరాత్ ప్రభుత్వ చర్యలపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. దోషుల విడుదలపై వివరణ కోరిన సీజేఐ ధర్మాసనం.. గుజరాత్, కేంద్ర ప్రభుత్వాలకు నోటీసులిచ్చింది. పిటిషనర్లు తరఫున సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, అభిషేక్ మను సింఫ్వీు అపర్ణ భట్లు హాజరయ్యారు. ‘‘మేము దోషుల రెమిషన్ను మాత్రమే సవాల్ చేస్తున్నాం.. సుప్రీంకోర్టు ఆదేశాలను కాదు..మై లార్డ్స్ సర్వోన్నత న్యాయస్థానం ఉత్తర్వులు మంచివే… అయితే, వారికి ఉపశమనాన్ని మంజూరు చేసిన సూత్రాలను మేం సవాల్ చేస్తున్నాం’’ అని కపిల్ సిబల్ అన్నారు.
గోద్రా ఘటన అనంతరం 2002లో గుజరాత్లో చేలరేగిన మత ఘర్షణల సమయంలో బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారానికి పాల్పడి కుటుంబసభ్యులను దారుణంగా చంపేశారు. 2002 మార్చి 3న బానో మూడేళ్ల కుమార్తె సహా కుటుంబంలోని ఏడుగురిని దుండగులు హత్యచేశారు. ఐదు నెలల గర్భవతిగా ఉన్న ఆమెపై సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. ఈ ఘటనలో 11 మంది నిందితులకు ముంబయిలోని సీబీఐ ప్రత్యేక కోర్టు 2008 జనవరి 21న యావజ్జీవిత ఖైదు విధించింది.దోషులంతా 15ఏళ్లు కారాగారంలో గడపగా.. ఆజాదీ కా అమృత్మహోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 15న విడుదల చేసింది.