బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ కేసు 11 మంది నిందితుల విడుదలపై దుమారం కొనసాగుతోంది. అయితే దీనిపై బ్యూరోక్రాట్లు కూడా స్పందించారు. 134 మంది బ్యూరోక్రాట్లు సుప్రీంకోర్టు సీజేఐకు లేఖ రాశారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పున:పరిశీలించాలని కొత్త సీజేఐ జస్టిస్ యుయు లలిత్ను బ్యూరొక్రాట్లు కోరారు. సీజేఐకు లేఖ రాసిన వారిలో మాజీ ఢల్లీి లెప్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్, మాజీ కేంద్ర కార్యదర్శి కేఎం చంద్రశేఖర్, మాజీ విదేశాంగ సెక్రటరీలు శివశంకర్ మినన్, సుజతా సింగ్, మాజీ హోంశాఖ సెక్రటరీ జీ పిల్లై తదితరులు ఉన్నారు. దోషులను విడుదల చేయాలనే గుజరాత్ ప్రభుత్వం నిర్ణయాన్ని బ్యూరొక్రాట్లు తప్పుపట్టారు. గుజరాత్ ఘటన దిగ్బ్రాంతికరం అన్నారు. బిల్కిస్ బానోపై 2002లో సామూహిక అత్యాచారం , హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తోన్న నిందితులు 11 మందిని విడుదల చేయాలని గుజరాత్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. బిల్కిస్ బానో కుటుంబానికి చెందిన ఏడుగురిపై సామూహిక అత్యాచారం, హత్య చేసిన ఆరోపణలపై పదకొండు మంది నిందితులకు జనవరి 21, 2008న మంబయిలోని స్పెషల్ సీబీఐ కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. ఈ దోషులు 15 ఏళ్లు జైలు శిక్ష అనుభవించారు. వారిలో ఒకరు తనను ముందస్తుగా విడుదల చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అతని శిక్షను తగ్గించే అంశాన్ని పరిశీలించాలని గుజరాత్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. పంచమహల్ కలెక్టర్ సుజల్ మయత్ర నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. కొన్నినెలల క్రితం మిగతా వారందరినీ రిలీజ్ చేయాలని కమిటీ ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన సిఫార్సును రాష్ట్ర ప్రభుత్వానికి పంపగా… ఈ 11మంది దోషులందరికీ క్షమాభిక్ష పథకం కింది రిలీజ్ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. సబర్మతి ఎక్స్ప్రెస్ కోచ్ని తగలబెట్టిన ఘటనలో 59 మంది ‘కరసేవకులు’ మృతి చెందారు. తరువాత జరిగిన హింసలో.. ఐదు నెలల గర్భిణి బిల్కిస్ బానో పారిపోయింది. పొలంలో దాక్కుని ఉండగా, కొడవళ్లు, కత్తులు, కర్రలతో సాయుధులైన గుంపు వారిపై దాడి చేసింది. బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం చేశారు. దాడిలో ఆమె కుటుంబంలోని ఏడుగురు చనిపోగా.. ఆరుగురు సభ్యులు పారిపోయారు.