విమర్శలపై ఘాటుగా స్పందించిన స్వాతి మలివాల్..!
దిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ (డీసీడబ్ల్యూ) స్వాతి మలివాల్ను ఓ వ్యక్తి వేధింపులకు గురి చేసిన విషయం తెలిసిందే. దేశ రాజధాని నగరంలో మహిళలకు లభిస్తున్న భద్రతను తనిఖీ చేసేందుకు వెళ్లిన ఆమెను మద్యం మత్తులో ఓ వ్యక్తి కారుతో 15 మీటర్ల వరకు ఈడ్చుకుంటూ వెళ్లాడు. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. అయితే స్వాతి మలివాల్కు ఎదురైన వేధింపులు ఓ డ్రామా అని బీజేపీ నేతలు విమర్శించారు. దిల్లీ పోలీసుల ప్రతిష్టను దెబ్బతీసేందుకే ఆమె ఈ ఆరోపణలతో ముందుకొచ్చిందని, వేధింపుల వీడియోను డ్రామాగా బీజేపీ కొట్టిపారేసింది. అయితే కాషాయ పార్టీ విమర్శలపై స్వాతి మలివాన్ తాజాగా స్పందించింది. బీజేపీ ఆరోపణలు పచ్చి అబద్ధాలు అంటూ ట్విట్టర్ వేదికగా ఘాటుగా స్పందించింది. ‘నా గురించి చెత్త అబద్ధాలు చెప్పి, నన్ను భయపెట్టాలనుకునేవారికి ఓ విషయం చెప్పాలనుకుంటున్నా. ఈ చిన్న జీవితంలో ఎన్నో పెద్ద పనులు చేశా. తలకు గుడ్డకట్టుకుని నాపై ఎన్నో సార్లు దాడులు చేశారు. అయినా నేను ఆగలేదు. ప్రతి దాడితో నాలో ఉన్న జ్వాల మరింత రగులుతూ బయటకొచ్చింది. నా గొంతును ఎవరూ అణచివేయలేరు. నేను బతికి ఉన్నంత వరకు పోరాడుతూనే ఉంటా’ అంటూ రాసుకొచ్చింది.