లోక్సభ స్పీకర్గా ఓం బిర్లా
. వరుసగా రెండోసారి ఎన్నిక
. మూజువాణి ఓటింగ్ ద్వారా నిర్ణయం
. బలరామ్ జాకర్ రికార్డు తిరగరాసిన బీజేపీ ఎంపీ
. బిర్లాను స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టిన మోదీ, రాహుల్
. నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్న విపక్షాలు
న్యూదిల్లీ : లోక్సభ స్పీకర్ ఎవరన్న ఉత్కంఠకు తెరపడిరది. 18వ లోక్సభ స్పీకర్గా ఓం బిర్లా ఎన్నికయ్యారు. రాజస్థాన్లోని కోటా పార్లమెంట్ స్థానం నుంచి మూడుసార్లు ఎన్నికైన ఓం బిర్లా… లోక్సభ స్పీకర్గా రెండోసారి ఎన్నికైన రెండో వ్యక్తి. అంతకు ముందు బలరామ్ జాఖర్ మాత్రమే వరుసగా రెండుసార్లు స్పీకర్ పదవిలో ఉన్నారు. ఆయన 1980 జనవరి నుంచి 1989 డిసెంబరు వరకూ (ఏడు, ఎనిమిదో లోక్సభ) స్పీకర్గా బాధ్యతలు చేపట్టారు. మూజవాణి ఓటు ద్వారా స్పీకర్గా ఎన్నికైన ఓం బిర్లాను సభాపతి సీటు వద్దకు ప్రధాని నరేంద్ర మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజులు తీసుకెళ్లి కూర్చోబెట్టారు. అధికార, విపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో లోక్సభ స్పీకర్ పదవికి ఎన్నిక అనివార్యమైంది. ఎన్డీయే నుంచి ఓం బిర్లా, ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ ఎంపీ కే సురేశ్ నామినేషన్ దాఖలు చేశారు. మూజువాణి ఓటుతో ఆయన ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ప్రకటించారు. బుధవారం ఉదయం 11 గంటలకు లోక్సభ సమావేశం కాగానే ప్రొటెం స్పీకర్ మిగిలిపోయిన ఏడుగురు ఎంపీలతో ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం స్పీకర్ ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైంది. 18వ లోక్సభ స్పీకర్గా ఓం బిర్లాకు మద్దతుగా ప్రధాని నరేంద్రమోదీ తీర్మానం ప్రతిపాదించగా రక్షణమంత్రి రాజ్నాథ్సింగ్ బలపర్చారు. ఆ తర్వాత మరికొందరు మంత్రులతోపాటు ఎన్డీయే పక్షాలకు చెందిన ఎంపీలు ఓం బిర్లా అభ్యర్థిత్వానికి మద్దతు ప్రకటించారు. ఆ తర్వాత ఇండియా ఐక్య సంఘటన తరఫున కె.సురేశ్ పేరును శివసేన ఎంపీ అరవింద్ సావంత్ ప్రతిపాదించగా మరికొందరు బలపరిచారు. అనంతరం మూజువాణి ఓటుతో 18వ లోక్సభ స్పీకర్గా ఓంబిర్లా ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ప్రకటించారు. లోక్సభ స్పీకర్ పదవి కోసం రెండు నామినేషన్లు దాఖలు కావడంతో ఎన్నిక జరుగుతుందని అంతా భావించారు. కానీ ప్రొటెం స్పీకర్ వాయిస్ ఓటుతో స్పీకర్ ఎన్నికను ముగించడంతో ఓంబిర్లా ఏకగ్రీవంగా స్పీకర్గా ఎన్నికయ్యారు. ఇండియా ఐక్య సంఘటన ఓటింగ్ కోరినప్పటికీ ఓటింగ్ కోసం పట్టుబట్టకపోవడంతో స్పీకర్ ఎన్నిక ప్రక్రియ వేగంగా ముగిసింది. ప్రధాని నరేంద్రమోదీ, ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ, పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తదితరులు ఓం బిర్లా స్థానం వద్దకు వెళ్లి అభినందనలు తెలిపారు. ఆ తర్వాత ఆయనను స్పీకర్ స్థానం వద్దకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ప్రధాని మోదీ ఓంబిర్లాపై ప్రశంసలు కురిపించారు. ఆయన పార్లమెంట్ సభ్యులకు మార్గనిర్దేశం చేస్తూ సభలో పెద్దన్న పాత్ర పోషిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. ‘రెండోసారి ఈ పీఠాన్ని దక్కించుకున్న మీకు సభ్యులందరి తరఫున శుభాకాంక్షలు. గతంలో బలరాం జక్కర్ తర్వాత వరుసగా రెండోసారి స్పీకర్ పదవి చేపట్టే అవకాశం మీకు వచ్చింది. వచ్చే 5 ఏళ్లు సభ్యులందరికీ మార్గదర్శనం చేస్తారన్న విశ్వాసం ఉంది. దేశ ప్రజల ఆకాంక్షలను పూర్తి చేసేందుకు ఈ సభ తన బాధ్యతను నిర్వహించటంలో మీ పాత్ర ఎక్కువగా ఉండనుంది’ అని మోదీ అన్నారు. ప్రతిపక్ష నేత బిర్లాను అభినందిస్తూ… ‘మీ పనిలో ప్రతిపక్షం మీకు సహాయం చేయాలనుకుంటోంది. మీరు మమ్మల్ని సభలో మాట్లాడేందుకు అనుమతిస్తారనే నమ్మకం నాకు ఉంది’ అన్నారు. గతంకంటే అధిక స్థాయిలో ఈసారి విపక్షాలు భారతీయుల గొంతుకను సభలో వినిపించనున్నాయని తెలిపారు. సభ గౌరవాన్ని దెబ్బతీసేలా ఎంపీల సస్పెన్షన్ వంటి చర్యలు స్పీకర్ తీసుకోబోరని సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఆకాంక్షించారు. ప్రతిపక్షాల పట్ల బిర్లా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారని, ఆయా పార్టీల నాయకులకు సమాన అవకాశాలు కల్పిస్తారని తాను ఆశిస్తున్నానని ఆయన అన్నారు. తృణమూల్ కాంగ్రెస్ నేత సుదీప్ బంద్యోపాధ్యాయ, డీఎంకే నేత టీఆర్ బాలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సభ పనితీరు ఎల్లప్పుడూ అధికార పక్ష వైఖరిపై ఆధారపడి ఉంటుందని బందోపాధ్యాయ అన్నారు. 17వ లోక్సభలో ప్రతిపక్ష ఎంపీల సస్పెన్షన్ను ప్రస్తావిస్తూ… ఇది వాంఛనీయం కాదని అన్నారు. మీరు ప్రతిపక్షాన్ని, అధికార పక్షాన్ని ఒకే విధంగా చూడాలి. దయచేసి నిష్పక్షపాతంగా ఉండండి అని బాలు పేర్కొన్నారు.
అంతరాయాలు ఉండరాదని కోరుకుంటున్నా: ఓం బిర్లా
స్పీకర్ ఓం బిర్లా స్పందిస్తూ… ‘‘అధికార, ప్రతిపక్ష సభ్యులు కలిసి సభను నడపాలి. అందరి మాట వినడం, అందరి అంగీకారంతో సభను నడపడమే భారత ప్రజాస్వామ్య బలం. అందరి అంగీకారంతో సభను నడపాలని నేను ఆశిస్తాను. పార్టీ నుంచి ఒక్క సభ్యుడు ఉన్నా… వారికి తగిన సమయం కావాలి’ అని బిర్లా అన్నారు. సభలో అంతరాయాలు ఉండకూడదని కోరుకుంటున్నానని అన్నారు. విమర్శలు ఉండవచ్చు కానీ సభను అడ్డుకోవడం సంప్రదాయం కాదని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి, ఎల్జేపీ (రామ్విలాస్) నాయకుడు చిరాగ్ పాశ్వాన్ స్పీకర్ పదవికి ఎన్నిక జరిగేలా చేసినందుకు ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. ప్రతిపక్షాలు పాలిస్తున్న అనేక రాష్ట్రాల్లో, అసెంబ్లీలో స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవులు రెండూ అధికార పక్షానికి చెందినవే అన్నారు. డిప్యూటీ స్పీకర్ పదవి ప్రతిపక్షాలకు ఇవ్వాలన్న ఇండియా ఐక్య సంఘటన డిమాండ్ను బీజేపీ అంగీకరించకపోవడంతో లోక్సభ స్పీకర్ ఎన్నిక అనివార్యమైన సంగతి విదితమే.
మోదీ, రాహుల్ కరచాలనం
స్పీకర్ ఎన్నిక సందర్భంగా లోక్సభలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఓం బిర్లాను స్పీకర్గా స్థానం వద్దకు తీసుకురావాలని ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ కోరడంతో ప్రధాని మోదీ, పార్లమెంటరీ వ్యవహరాల శాఖ మంత్రి కిరణ్ రిజిజుతో పాటు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఓంబిర్లా కూర్చున్న సీటు వద్దకు వెళ్లి ఆయనకు శుభాకాంక్షలు తెలిపి.. స్పీకర్ స్థానం వద్దకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఓం బిర్లా పక్కనే ఉన్న ప్రధాని మోదీతో రాహుల్ గాంధీ కరచాలనం చేశారు. మోదీ కూడా నవ్వుతూ రాహుల్తో చేయి కలిపారు. ఆ తర్వాత ఓం బిర్లాను స్పీకర్ స్థానం వద్దకు తీసుకెళ్లారు.