బీర్భూమ్ హింసపై మమతా బెనర్జీ
కోల్కతా : బీర్భూమ్ హింసాకాండపై బీజేపీ నిజనిర్దారణ కమిటీ నివేదికను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం తప్పుపట్టారు. బీజేపీ నిజనిర్దారణ కమిటీ నివేదిక ఇవ్వడం ఈ కేసులో సీబీఐ దర్యాప్తును బలహీన పరచడంతోపాటు దర్యాప్తులో జోక్యం చేసుకోవడమే అవుతుందని ఆమె అన్నారు. మార్చి 21న రామ్పుర్హట్ సమీపంలోని బోగ్టుయి గ్రామంలో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేత భడు షేక్ హత్యానంతరం బీర్భూమ్ హింసాకాండ చోటుచేసుకుంది. బీర్భూమ్ ఘటనలో ఎనిమిది మంది సజీవదహనం కాగా, ఆ తర్వాత తీవ్రంగా గాయపడి ఒకరు మృతి చెందారు. దీనిపై బీజేపీ నిజనిర్ధారణ కమిటీ బుధవారం ఒక నివేదకను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు సమర్పించింది. ఇక్కడ హిల్ టౌన్లో బెనర్జీ విలేకరులతో మాట్లాడుతూ కాషాయ పార్టీపై బెనర్జీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆ నివేదికలో టీఎంసీ బీర్భూమ్ జిల్లా అధ్యక్షుడు అనుబ్రత మోండల్ పేరును ప్రస్తావించడం చాలా స్పష్టంగా బీజేపీ ప్రతీకార ధోరణిని చాటుతోందని ఆరోపించారు. బీజేపీ అనుసరిస్తున్న ఈ ధోరణిని తాను తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. విచారణ జరుగుతున్న సమయంలో ఏ రాజకీయ పార్టీ కూడా జోక్యం చేసుకోరాదన్నారు. అది సీబీఐ దర్యాప్తును బలహీన పరుస్తుందని తెలిపారు. ‘వాళ్లు మా జిల్లా అధ్యక్షుడి పేరును ప్రస్తావించారు. ఇది కక్షసాధింపు ధోరణే. దర్యాప్తు పూర్తి కాకుండానే ఆయన పేరు ఎలా చెబుతారు? దానిని బట్టి చూస్తే అతన్ని అరెస్టు చేయాలని వారు కోరుకుంటున్నారు. ఇది పూర్తిగా వ్యక్తిగత కక్షే. వాళ్లు కుట్ర పన్నుతున్నారు’ అని మమత ఆరోపించారు. కలకత్తా హైకోర్టు ఆదేశాల ప్రకారం ఈ కేసుపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది. దీనికి ముందు బెంగాల్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ఈ కేసును దర్యాప్తు చేసింది.