సోనియాతో లాలూ… నితీశ్ భేటీ
న్యూదిల్లీ: 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవడానికి ప్రతిపక్ష పార్టీలను ఏకం చేసేందుకు బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆదివారం ఇక్కడ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిశారు. సోనియా 10 జనపథ్ నివాసంలో జరిగిన సమావేశం ప్రతిపక్ష ఐక్యతను ఏర్పరచడంలో చాలా కీలకమైనదిగా పరిగణించబడుతుంది. ఎందుకంటే కాంగ్రెస్, సాంప్రదాయకంగా విభేదిస్తున్న కొన్ని ప్రాంతీయ పార్టీల మధ్య ఐక్యతను పునరుద్ధరించటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. బీజేపీతో తెగతెంపులు చేసుకుని, ఆగస్టులో బీహార్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆర్జేడీ, కాంగ్రెస్తో చేతులు కలిపిన తర్వాత నితీశ్ కుమార్ సోనియాను కలవడం ఇదే తొలిసారి. లాలూ ప్రసాద్ చాలా కాలం తర్వాత రాజకీయంగా పాల్గొనడం ఇదే తొలిసారి. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. సమావేశం అనంతరం లాలూ విలేకరులతో మాట్లాడుతూ ‘బీజేపీని ఓడిరచేందుకు ప్రతిపక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకురావాలి. కాంగ్రెస్ తన కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియలో ఉంది. ఎన్నికల తర్వాత మళ్లీ కలుద్దామని సోనియా గాంధీ మాకు చెప్పారు’ అని అన్నారు. దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతిపక్షాలన్నీ చేతులు కలపాల్సిన అవసరం ఉందని నితీశ్ అన్నారు. ‘బీజేపీపై పోరాటంలో అన్ని ప్రతిపక్ష పార్టీలు ఒకే పేజీలో ఉన్నాయి. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికల తర్వాత ఒక నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళికపై చర్చ జరుగుతుంది’ అని సమావేశం అనంతరం ఆయన విలేకరులతో అన్నారు. అంతకుముందు, హరియాణాలో జరిగిన ఐఎన్ఎల్డీ ర్యాలీలో నితీశ్ ప్రసంగిస్తూ, బీజేపీని ఎదుర్కోవడానికి కాంగ్రెస్, వామపక్షాలతో సహా అన్ని ప్రతిపక్ష పార్టీలను ఏకం చేయాలని పిలుపునిచ్చారు.