పూర్తి వాక్సినేషకే తొలి ప్రాధాన్యం
భారత్లో కోవిడ్ స్థితిపై వైద్య నిపుణులు
న్యూదిల్లీ : కోవిడ్ను జయించేలా రోగ నిరోధక శక్తిని పెంచుకునే క్రమంలో భారతీయులకు ఇప్పట్లో బూస్టర్ డోసు అవసరం లేదని, పూర్తిస్థాయిలో వాక్సినేషన్కే తొలి ప్రాధాన్యత ఇవ్వాలని వైద్యనిపుణులు స్పష్టంచేశారు. జనాభాలో నాల్గో వంతు మందికి రెండు టీకాలు దక్కని పరిస్థితి దేశంలో ఉందన్నారు. జనాభాకు రెండు డోసులు అందిన తర్వాత పరిస్థితి అదుపు తప్పితే బూస్టర్ డోసు అవసరం రావచ్చుగానీ కనీసం నాల్గోవంతు జనాభాకు టీకాలు అందనప్పుడు కాదన్నారు. కోవిడ్ దశలవారీ విజృంభణ నేపథ్యంలో బూస్టర్ డోసులపై అంతర్జాతీయ స్థాయిలో భారీ చర్చ జరుగుతోంది. సాధ్యమైనంత ఎక్కువ మంది కనీసం ఒక్క డోసును పొందటం ముఖ్యమన్నది అనేకమంది శాస్త్రవేత్తల అభిప్రాయం. కాగా, భారత్లో 15శాతం మంది వయోజనులకు మాత్రమే కోవిడ్ వాక్సిన్ రెండు డోసులు లభించాయి. అంటే ఇన్ఫెక్షన్ ముప్పు ఎక్కువగా ఉన్న వారిలో చాలా మంది వాక్సినేషన్ పూర్తి కాలేదు అని న్యూదిల్లీ ఎన్ఐఐకి చెందిన ఇమ్యూనాలజిస్ట్ సత్యజిత్ రథ్ అన్నారు. ఈ పరిస్థితుల్లో కేవలం కొందరి కోసం మూడవ ‘బూస్టర్’ డోసును అందుబాటులోకి తేవడం నైతికంగా సరైనది కాదు.. అలా చేయడం తొందరపాటే అవుతుందని అని ఆయనన్నారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు వైరస్ ప్రమాదం ఎక్కువని తెలుసు కాబట్టి వాక్సినేషన్ వేగాన్ని పెంచడం అనివార్యం. ప్రస్తుతం అందుబాటులో ఉన్న రెండు డోసులు వైరస్ నుంచి సమర్థ రక్షణ కల్పించగలవని ఆయన చెప్పారు. అర్హులైన జనాభాలో 40 శాతం మందికి మొదటి డోసు కూడా అందని సమయంలో బూస్టర్ డోసుల గురించి ఆలోచించనే వ్యర్థమన్న అభిప్రాయాన్ని ఇమ్మూనాలజిస్ట్ వినీతా బాల్ వ్యక్తంచేశారు. ఈ విషయంలో సత్యజిత్ రథ్తో ఆమె ఏకీభవించారు. అయితే ఇప్పటికే ముంబైలోని కొంతమంది రాజకీయ నేతలు, హెల్త్కేర్ వర్కర్లు దీనిని తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బూస్టర్ డోసు కంటే రెండు డోసులను తీసుకోవడానికే అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ ఇటీవల నొక్కిచెప్పారు. ఇదిలావుంటే, శుక్రవారం ఒక్క రోజు దేశంలో 2.5కోట్ల మందికిపైగా కోవిడ్ వాక్సిన్ను తీసుకోగా ఇప్పటివరకు మొత్తం 79.33 కోట్ల టీకాల పంపిణీ జరిగినట్లు కోవిన్ పోర్టల్ డేటా చెబుతోంది. దేశంలోని వయోజనుల్లో 63శాతం మందికి మొదటి టీకా అందగా 21శాతం మంది రెండు టీకాలు పొందినట్లు అధికారిక వర్గాలు వెల్లడిరచాయి.