బెంగళూరు: ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి బెంగళూరు నగరంలో మోకాళ్లలోతు నీళ్లు చేరాయి. అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో పడవలు, ట్రాక్టర్లు సేవలందించగా, రహ దారులపై వరద నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడిరది. నగరంలోని అనేక సరస్సులు, మురికినీటి కాలువలు పొంగిపొర్లడంతో, లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. వరద నీరు ఇళ్లలోకి ప్రవేశించింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సర్జాపూర్ రోడ్లోని రెయిన్బో డ్రైవ్ లేఅవుట్, సన్నీ బ్రూక్స్ లేఅవుట్ వంటి ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడంతో ఉదయం విద్యార్థులు, కార్యాలయాలకు వెళ్లేవారిని తీసుకెళ్ల డానికి ట్రాక్టర్లు, పడవలు ఉపయోగించు కున్నారు. ఔటర్ రింగ్ రోడ్డులోని అనేక ప్రాంతాల్లో వర్షాలు, వరదల కారణంగా ఐటీ కంపెనీలు దెబ్బతిన్నాయి. బెంగళూరులో భారీ వర్షాలు కురుస్తున్నాయని, తాను కమిషనర్, ఇతర అధికారులతో మాట్లాడానని, నగరంలోని మహదేవపూర్, బొమ్మనహళ్లి మండలాలకు రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన బృందాలను నియమించాలని అధికారులను ఆదేశించానని సీఎం బసవరాజ్ బొమ్మై తెలిపారు. బెళ్లందూర్, షార్జాపురా రోడ్డు, అవుట్రింగ్ రోడ్, బీఈఎంఎల్ లేఅవుట్ తదితర ప్రాంతాలు నీటమునిగాయి. కొన్ని చోట్ల బయట పార్క్ చేసిన బైక్లు కొట్టుకుపోయిన వీడియోలు సోషల్మీడియాలో వైరల్ అవుతున్నాయి. హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ సమీపంలోనూ భారీగా వరదనీరు చేరింది.
ఐటీ ఆఫీసులకు రూ.225 కోట్ల నష్టం
నగరంలోకి ఐటీ కారిడార్ను కూడా భారీ వర్షం ముంచెత్తింది. అనేక కంపెనీ ఆఫీసుల్లోకి వరదనీరు చేరింది. దీంతో ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేయాలని అమెజాన్, విప్రో, ఫ్లిప్కార్ట్ వంటి సంస్థలు సూచిస్తున్నాయి. వర్షం కారణంగా తమ కంపెనీలకు రూ.225కోట్ల నష్టం వాటిల్లినట్లు బెంగళూరు ఔటర్ రింగ్రోడ్ కంపెనీస్ అసోసియేషన్ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైకి లేఖ రాసింది. దీనిపై చర్చలు జరిపి నిర్ణయం తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. బెంగళూరులో సెప్టెంబరు 9 వరకు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.