Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

బెజవాడలో హిజాబ్‌ వివాదం

కలెక్టర్‌, పోలీసు అధికారుల జోక్యంతో సమస్య పరిష్కారం

విశాలాంధ్ర బ్యూరో`విజయవాడ (వన్‌టౌన్‌) : ముస్లిం బాలికలు హిజాబ్‌ ధరించి తరగతి గదిలోకి వెళ్లకూడదని విజయవాడలోని ఓ ప్రముఖ కాలేజీ ప్రిన్సిపాల్‌ అడ్డుకోవడంతో స్వల్ప వివాదం ఏర్పడిరది. కలెక్టర్‌, పోలీసు అధికారులు వెంటనే జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించారు. తాడిగడప, అయ్యప్పనగర్‌కు చెందిన ఇద్దరు ముస్లిం విద్యార్థినులు నగరంలోని ఒక ప్రముఖ అటానమస్‌ కళాశాలలో డిగ్రీ(బీఎస్సీ) తృతీయ సంవత్సరం చదువుతున్నారు. వీరిద్దరు, మరో విద్యార్థిని గురువారం ఉదయం కళాశాలకు ఆలస్యంగా వచ్చారు. దీంతో మొదటి క్లాసుకు అనుమతివ్వకుండా తరగతి గది బయట నిలబెట్టారు. ముస్లిం విద్యార్థినులు హిజాబ్‌ ధరించి తరగతి గతి బయట ఉండటాన్ని ప్రిన్సిపాల్‌ గుర్తించారు. వెంటనే ఆయన వచ్చి బాలికల వెయిటింగ్‌ రూముకు వెళ్లి హిజాబ్‌ను తొలగించి యూనిఫామ్‌లో తరగతి గదిలోకి వెళ్లాలని సూచించగా, తాము తొలగించబోమని, కళాశాలలో చేరినప్పటి నుంచి తాము ఇదే విధంగా వస్తున్నామని, ఇప్పుడు ఎందుకు అడ్డుకుంటున్నారని విద్యార్థినులు ప్రశ్నించారు.
దీంతో తల్లిదండ్రులను పిలిపించాలని విద్యార్థినులకు ప్రిన్సిపాల్‌ చెప్పారు. వెంటనే ముస్లిం విద్యార్థినులు తమ తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి హిజాబ్‌ ధరించడం వల్ల తరగతి గదిలోకి అనుమతివ్వలేదని చెప్పగా, వారు ఆందోళనకు గురై మైనారిటీ నాయకులకు సమాచారం ఇచ్చారు. మైనారిటీ నాయకులు తాము కాలేజీ వద్దకు వస్తే వివాదం మరింత తీవ్రమవుతుందని పోలీసు అధికారులకు సమాచారం ఇచ్చారు. అప్పటికే మీడియాలో విజయవాడలో హిజాబ్‌ వివాదం పేరుతో పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో కలెక్టర్‌ జె.నివాస్‌, నగర పోలీస్‌ కమిషనర్‌ కాంతి రాణా టాటా ఫోన్‌లో కళాశాల ప్రిన్సిపాల్‌తో మాట్లాడారు. విద్యార్థినులు కళాశాలకు హిజాబ్‌ ధరించి వస్తారని, అయితే బాలికల వెయిటింగ్‌ హాలుకు వెళ్లి హిజాబ్‌ తొలగించి యూనిఫాంలో తరగతి గదిలోకి వెళతారని, ఈ మేరకు అడ్మిషన్‌ పత్రంపై సంతకం కూడా చేశారని ప్రిన్సిపాల్‌ చెప్పారు. కానీ అనూహ్యంగా గురువారం ఉదయం తాము హిజాబ్‌తోనే తరగతి గదిలోకి వెళతామని పట్టుబట్టారని తెలిపారు.
సమస్య జటిలం కాకుండా ఉండేందుకు విద్యార్థినులను తరగతి గదిలోకి అనుమతించాలని కలెక్టర్‌ సూచించగా, ప్రిన్సిపాల్‌ అంగీకరించడంతో వివాదం ముగిసింది. మరోవైపు ముస్లిం మైనారిటీ నాయకులు కళాశాల వద్దకు చేరుకుని రాజ్యాంగం మైనారిటీలకు కల్పించిన హక్కులను కళాశాల యాజమాన్యం కాలరాస్తోందని, తగిన చర్యలు తీసుకోవాలని కొద్దిసేపు ఆందోళన నిర్వహించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img