రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా నేత బోరుగడ్డ అనిల్ కుమార్ పార్టీ కార్యాలయంకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. సోమవారం అర్థరాత్రి దాటిన తర్వాత గుంటూరు డొంకరోడ్డులో ఉన్న ఆఫీసును దుండగులు తగులబెట్టారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి మంటలు ఆర్పారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కార్యాలయంలో ఉన్న ఫర్నీచర్ మొత్తం బూడిదయ్యింది. ఆరుగురు వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పటించి తనపై దాడి చేసినట్టు అక్కడి వాచ్ మెన్ చెబుతున్నాడు. బొరుగడ్డ అనిల్ కుమార్ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఏపీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఈ ఘటనపై అనిల్ కుమార్ స్పందించారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, గిరిధర్ రెడ్డి స్థానిక టీడీపీ నేతలతో కలిసి ఈ పని చేశారని ఆరోపించారు. ఈ ఘటన వెనుక మాజీ మంత్రి నక్కా ఆనందబాబు హస్తం ఉందని ఆరోపించారు. సీఎం జగన్ ఈ ఘటనపై విచారణ జరిపి.. తనతో పాటూ కుటుంబానికి భద్రతను కల్పించాలని కోరారు. రెండు రోజుల క్రితం కొందరు టీడీపీ నేతలు తన పార్టీ కార్యాలయం దగ్గరకు వచ్చి బెదిరించారని గుర్తు చేశారు. ఈ నెల 5న సాయంత్రం సౌపాటి రత్నంతో పాటూ కొంతమంది పార్టీ ఆఫీస్ పై దాడికి వచ్చారని అనిల్ వర్గం చెబుతోంది.