మళ్లీ క్రూడాయిల్ ధరలు పెరుగుతున్నాయి. బుధవారం జరగనున్న కీలక ఒపెక్- పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ ఆర్గనైజేన్ దేశాల భేటీకి ముందు ఆయిల్ ధరలు భగ్గుమంటున్నాయి. మంగళవారం ప్రారంభ సెషన్లో గరిష్ట విలువల ట్రేడవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం అంచనాల నేపథ్యంలో క్రూడాయిల్కు డిమాండ్ పెరుగుతోంది. ఇది ఆందోళనలకు కారణమైంది. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్.. 43 సెంట్లు పెరిగి బ్యారెల్కు 89.29 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. యూఎస్ క్రూడ్ ఫ్యూచర్స్ 22 సెంట్ల మేర పెరిగి బ్యారెల్కు 83.85 డాలర్ల వద్ద ఉంది. సప్లై టైట్నెస్తో ఆయిల్ ధరలు పెరుగుతున్నాయి. అయితే అంతర్జాతీయ క్రూడ్ ధరలకు అనుగుణంగా దేశీయంగా ఆయిల్ కంపెనీలు.. ఇండియన్ ఆయిల్, హిందుస్థాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం వంటి సంస్థలు నగరాల వారీగా రోజూ ఇంధన ధరలను అప్డేట్ చేస్తుంటాయి. అయితే.. ఇటీవల క్రూడ్ ధరలు భారీగా పతనమైనా దేశీయంగా వాహనదారులకు ఎలాంటి ఊరట లభించలేదు. పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపునకు నిర్ణయం తీసుకోలేదు. ఇది గతంలో కొవిడ్, రష్యా- ఉక్రెయిన్ యుద్ధసమయంలో క్రూడ్ ధరలు పెరిగిన సమయంలో తమకు వచ్చిన నష్టాలను పూడ్చుకునేందుకు తీసుకున్న నిర్ణయంగా తెలుస్తోంది. దీంతో.. కొద్దిరోజులుగా దేశంలో ఇంధన ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇప్పుడు క్రూడ్కు డిమాండ్ నేపథ్యంలో ధరలు పెరుగుతున్నాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్కు 90 డాలర్లకు చేరువైంది. అయితే ఇప్పుడు ఇది భారత్లో వాహనదారులకు ఆందోళన కలిగిస్తోంది. మళ్లీ చమురు ధరలు పెరిగితే.. తమ జేబులకు చిల్లు పడుతుందేమోనని భయపడుతున్నారు. అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు పెరిగితే దేశీయంగా ఆయిల్ ధరలను చమురు కంపెనీలు సవరిస్తే.. నేరుగా కస్టమర్ల పాకెట్పై ప్రభావం పడుతుంది. ఇటీవల మహారాష్ట్రలో ఏకనాథ్ శిందే ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత.. లీటర్ పెట్రోల్పై రూ.5, డీజిల్పై 3 రూపాయల చొప్పున తగ్గించాయి. ఇదే సమయంలో మేఘాలయలో పెట్రోల్, డీజిల్పై లీటర్కు రూ.1.50 మేర పెరిగింది. వ్యాట్ ఆధారంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఒక్కో నగరాల్లో ఒక్కోలా ఉంటాయి.
అక్టోబర్ 4న దిల్లీలో పెట్రోల్ ధర లీటర్కు రూ. 96.72 చొప్పున అమ్ముడవుతోంది. లీటర్ డీజిల్ రూ. 89.62 వద్ద ఉంది. ముంబయిలో ఈ ధరలు కాస్త ఎక్కువే ఉన్నాయి. ఈ ఆర్థిక రాజధానిలో లీటర్ పెట్రోల్ ధర రూ. 106.31గా ఉండగా.. డీజిల్ లీటర్కు 94.27 రూపాయల వద్ద ఉంది.
హైదరాబాద్లో ఈ ధరలు కాస్త ఎక్కువే ఉన్నాయి. అక్టోబర్ 4న హైదరాబాద్లో పెట్రోల్ ధర లీటర్కు రూ. 109.64 వద్ద ఉంది. డీజిల్ కూడా లీటర్కు రూ. 97.80 వద్ద ఉంది. మరి ఇప్పుడు అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు పెరిగితే ఇక్కడ కూడా వాహనదారులకు మరోసారి పెట్రో మంట తాకే అవకాశాలున్నాయి.