ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులను సురక్షితంగా తరలించేందుకు కేంద్రం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు ఉక్రెయిన్కు, రష్యాకు భారత్ పలుమార్లు విజ్ఞప్తి చేసింది. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ ఇరుదేశాల అధ్యక్షులతో స్వయంగా మాట్లాడారు. ఉక్రెయిన్ ఈశాన్య నగరమైన సుమీలో సుమారు 600 మంది భారతీయ విద్యార్థులు చిక్కుకుపోయారు. ఎన్నిమార్లు ప్రయత్నించినా ఆ ప్రాంతాన్ని వీడి బయటపడటం కుదరడం లేదు. నిన్న జరిగిన ఐరాస భద్రతామండలి సమావేశంలో భారత్ ఈ విషయాన్ని లేవనెత్తి ఆందోళన వ్యక్తంచేసింది. ఈ క్రమంలో పౌరుల తరలింపునకు రష్యా ముందుకొచ్చింది. సుమీతోపాటు పలు ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజలు తరలివెళ్లేందుకు మానవతా కారిడార్లను ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం కాల్పులను తాత్కాలికంగా విరమించనున్నట్లు సమాచారం. భారత కాలమానం ప్రకారం, మధ్యాహ్నం 12.30కి ఈ ఆపరేషన్ ప్రారంభం కానుంది.