అంతర్జాతీయ ఉగ్రసంస్థ అల్ఖైదా.. భారత్ను హెచ్చరించింది. మహమ్మద్ ప్రవక్తను అవమానించిన వారిపై ప్రతీకారం తీర్చుకుంటామని అల్ఖైదా ప్రకటించింది. భారత్లోని కీలక నగరాలపై ఆత్మాహుతి దాడులకు పాల్పడతామని హెచ్చరించింది. ‘‘ప్రవక్త గౌరవం కోసం మేం పోరాడతాం. ప్రవక్తను అవమానించిన వారిని అంతమొందిస్తాం. ఎలాంటి శాంతి వచనాలు, భద్రతలు వారిని కాపాడలేవు. ప్రవక్తను అవమానించి క్షమాపణలు చెప్పినంత మాత్రాన ఈ దుమారం ఆగదు. శరీరాలకు పేలుడు పదార్థాలను బిగించిన ఆత్మాహుతి దళాలను రంగంలోకి దించుతాం.మా పిల్లలను సైతం ఇందుకు వినియోగిస్తాం.‘‘ అని హెచ్చరిస్తూ ప్రకటన విడుదల చేసింది.భారత్లోని ఢల్లీి, ముంబయి నగరాలతో పాటు ఉత్తర్ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలలో ఆత్మాహుతి దాడులు చేస్తామని హెచ్చరించింది. అయితే, ఇటీవల కాలంలో భారత్ను అల్ఖైదా హెచ్చరించడం ఇది రెండోసారి. ఈ ఏడాది ఏప్రిల్లోనూ హిజాబ్ వివాదంపై ఇలాంటి హెచ్చరికలే చేసింది. ‘‘మన ప్రవక్త భారతదేశంపై యుద్ధం (ఘజ్వా-ఎ-హింద్) గురించి మాకు చెప్పారు.. భారతదేశంలో ముస్లింల విజయాన్ని ఊహించారని కూడా మేము ఉపఖండంలోని మా సోదరులకు గుర్తు చేస్తున్నాం’’ అని వ్యాఖ్యానించింది. ఇస్లామిక్ దేశాలు తీవ్ర నిరసనలు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అల్ఖైదా ఈ హెచ్చరికలు చేసింది. కానీ, ఇస్లామిక్ దేశాల ఆందోళనలపై భారత్ తీవ్రంగానే స్పందించింది. కొందరు వ్యక్తుల వ్యాఖ్యలను ప్రభుత్వానికి ఆపాదించడం తగదని భారత్ ఇప్పటికే ఆయా దేశాలకు స్పష్టం చేసింది. అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తులపై భారతీయ జనతా పార్టీ చర్యలు తీసుకుందని వివరించింది. అన్ని మతాలను సమానంగా ఆదరించడం, గౌరవించడం భారతీయ సంస్కృతిలోనే ఉందని తెలిపారు.