ఆర్థిక మందగమనం, ద్రవ్యోల్భణం భయాల మధ్య ప్రముఖ సాఫ్ట్వేర్, ఈ-కామర్స్ కంపెనీలు, సామాజిక మాధ్యమాలు ఖర్చులను తగ్గించుకునే పనిలో పడ్డాయి. ఇందులో భాగంగా ఉద్యోగాల్లో భారీగా కోతలు పెడుతున్నాయి. కొత్త నియామకాలను తగ్గించడంతోపాటు ఉన్నవారిని ఉద్యోగాల్లో నుంచి తీసేస్తున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే 10 వేల మంది ఉద్యోగులను తొలగించిన ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్.. మరో 18 వేల మందికిపైగా ఉద్యోగులపై వేటువేసేందుకు సిద్దమైంది.ఇందులో భారత్కు చెందిన సుమారు 1000 మంది ఉన్నట్లు తెలుస్తున్నది. వీరంతా సాఫ్ట్వేర్, హూమన్ రిసోర్స్, ఇతర విభాగాల్లో పనిచేస్తున్నారని, జనవరి 18 తర్వాత వీరికి ఈ-మెయిల్, సామాజిక మాధ్యమాలైన లింక్డ్ఇన్, ట్విట్టర్ ద్వారా తొలగింపునకు సంబంధించిన సమాచారాన్ని అందించనున్నట్లు తెలుస్తున్నది. కాగా, తాజాగా వేటు పడనున్న ఉద్యోగులకు ఐదు నెలల జీతాన్ని ముందుగానే చెల్లిస్తామని హామీ ఇస్తున్నట్లు సమాచారం. మరిన్ని విషయాలకోసం టీమ్ లీడర్లను కలవాల్సిందిగా మెయిల్స్ పేర్కొంటున్నారు. ఈ కొత్త సంవత్సరంలో తమ కంపెనీలోని 18 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలుకనున్నట్టు కంపెనీ సీఈవో ఆండీ జెస్సీ గతవారం ప్రకటించిన విషయం తెలిసిందే. కొవిడ్ సమయంలో చాలామంది ఉద్యోగులను నియమించుకొన్నామని, అనిశ్చిత పరిస్థితుల కారణంగా వారిని తొలగిస్తున్నామని తెలిపారు. అమెజాన్ స్టోర్స్, పీఎక్స్టీ ఆర్గనైజేషన్స్ నుంచి ఉద్యోగులను తొలగిస్తున్నట్టు ప్రకటించారు. ఇక ప్రముఖ టెక్ కంపెనీ ‘సేల్స్ఫోర్స్’ కూడా అమెజాన్ బాటలోనే నడుస్తున్నది. ఈ ఏడాది తమ కంపెనీలోని 8 వేల మందిని (10శాతం) ఉద్యోగులను తొలగించనున్నట్టు ప్రకటించింది. అలాగే, కొన్ని కార్యాలయాలను కూడా మూసివేస్తున్నట్టు తెలిపింది.