దిల్లీలో ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ
దేశం మొత్తం రావడనికి రెండేళ్లు పట్టే అవకాశం
దేశ టెలికాం రంగంలో కొత్త శకం మొదలైంది. దేశంలో 5జీ సేవలు శనివారం మొదలయ్యాయి. దిల్లీ ప్రగతి మైదాన్లో 6వ ఇండియా మొబైల్ కాంగ్రెస్`2022 కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ దీంతోపాటు 5జీ సేవలకు శ్రీకారం చుట్టారు. ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఈనెల 4వ తేదీ వరకు కొనసాగుతుంది. దీన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికం (డాట్), సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఓఏఐ) కలసి నిర్వహిస్తున్నాయి. ఈ ఏడాది ఆగస్టులో జరిగిన 5జీ స్పెక్ట్రమ్ వేలంలో ఒకటిన్నర లక్షల కోట్ల రూపాయల మొత్తం బిడ్లను డాట్ అందుకుంది. స్పెక్ట్రమ్ వేలంలో రిలయన్స్ జియో, అదానీ గ్రూప్, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలు పాల్గొన్నాయి. అదానీ గ్రూప్ తన సొంత అవసరాల కోసం స్పెక్ట్రమ్ ను కొన్నది. రిలయన్స్ జియో, ఎయిర్ టెల్, వీఐ ద్వారా 5జీ సేవలు దిల్లీ, ముంబైతో సహా ఏడు నగరాల్లో అందుబాటులోకి వస్తాయని అధికారులు తెలిపారు. అయితే, ఇందుకు కొంత సమయం పట్టే అవకాశం ఉంది. రిలయన్స్ జియో ఇప్పటికే జియో 5జీ సర్వీస్ ను దశల వారీగా అందించాలని తమ వార్షిక సర్వసభ్య సమావేశంలో నిర్ణయించింది. ఈ దీపావళి నాటికి నాలుగు ప్రధాన నగరాలు.. దిల్లీ, కోల్కతా, చెన్నై, ముంబైలో 5జీ సేవలను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అంటే ఈ నెలఖరు వరకు ఈ నగరాల్లో 5జీ నెట్వర్క్ అందుబాటులోకి వస్తుంది.