మంత్రి పేర్ని నాని ప్రకటన
విశాలాంధ్ర`మచిలీపట్నం : కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న భారత్బంద్కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూత్రప్రాయంగా సంపూర్ణ మద్ధతు తెలుపుతుందని రాష్ట్ర రవాణా, సమాచార శాఖమంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) ప్రకటించారు. స్థానిక ఆర్ అండ్ బీ అతిథిగృహంలో శనివారం విలేకరులతో మంత్రి నాని మాట్లాడుతూ విశాఖ ఉక్కును ప్రజల ఆస్తిగా ఉంచాలని, కార్పొరేట్ శక్తులకు అమ్మవద్దని ప్రజల తరపున కేంద్రాన్ని కోరుతున్నట్లు చెప్పారు. రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరారు. భారత్బంద్ సందర్భంగా 26 అర్ధరాత్రి నుంచి 27 మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఆర్టీసీ బస్సులు నిలిపివేస్తున్నట్లు తెలిపారు. మధ్యాహ్నం ఒంటిగంట తరువాత బస్సులు అందుబాటులో ఉంటాయని ప్రజలు గమనించాలన్నారు. ప్రజలు, రాజకీయ పార్టీలు శాంతియుతంగా నిరసన తెలపాలని కోరారు.