ప్రధాని మోదీ
అమెరికాలో 20 ఏళ్ల క్రితం ఇదే రోజున జరిగిన 9/11 ఉగ్రదాడులు యావత్ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేశాయి. అమెరికాలోని ప్రపంచ వాణిజ్య భవంతులపై అల్ఖైదా ఉగ్రదాడి జరిగి 20 ఏళ్ళు అయిన సందర్భంగా ప్రధాని మోదీ స్పందించారు. 2001, సెప్టెంబరు 11న జరిగిన ఉగ్రదాడి అత్యంత విషాదకరమని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే భారత్ నేర్పిన మానవతా విలువలే శాశ్వత పరిష్కారమని అన్నారు. సెప్టెంబర్ 11 ఘటనను మానవత్వంపై జరిగిన దాడిగా అభివర్ణించారు. శనివారం గుజరాత్లోని అహ్మదాబాద్లో సర్దార్థామ్ భవన్ ప్రారంభోత్సవం సందర్భంగా మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా సెప్టెంబర్ 11వ తేదీకి మరో ప్రాధాన్యత కూడా ఉందని చెప్పారు. 1893లో ఇదే తేదీన చికాలోలో స్వామి వివేకానంద ప్రసంగం చేశారని, భారతదేశ మానవతా విలువలను ప్రపంచ దేశాలకు స్వామి వివేకానందం తన ప్రసంగంలో చాటి చెప్పారని అన్నారు. ఆ విలువలే సెప్టెంబరు 11న ఉగ్రదాడి వంటి దాడులకు పరిష్కారం చూపగలవన్నారు. భారతదేశ సంస్కృతిని ఎంతో అద్భుతంగా విశ్వవేదికపై స్వామి వివేకానంద ఆవిష్కరించారని చెప్పారు. ఈ విషయాన్ని యావత్ ప్రపంచమూ క్రమంగా గుర్తింస్తోందన్నారు. ఈ రోజునే సర్దార్థామ్ భవన్ ప్రారంభం కావడం విశేషమన్నారు. విద్య, సామాజిక మార్పు, బలహీన వర్గాలకు చేయూత, యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా సర్దార్థామ్ పని చేస్తుందని చెప్పారు.