సికింద్రాబాద్లోని జింఖానా గ్రౌండ్స్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. భారత్ఆస్ట్రేలియా మ్యాచ్ టికెట్ల కోసం అంచనాలకు మించి అభిమానులు వచ్చారు. వేలాదిగా రావడంతో తొక్కిసలాట జరిగింది. తోపులాటలో పోలీసులు కిందపడ్డారు. కొంతమంది అభిమానులు స్పృహతప్పారు.వారిని పోలీసులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఒక మహిళకు సీరియస్గా ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె ప్రస్తుతం యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ నెల 25న ఉప్పల్ స్టేడియంలో భారత్
ఆసీస్ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో టికెట్ల విక్రయాలకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) ఏర్పాట్లు చేసింది. సికింద్రాబాద్లోని జింఖానా గ్రౌండ్స్లో టికెట్లు విక్రయిస్తున్నారు. మ్యాచ్ టికెట్ల కోసం వేకువజామునుంచే అభిమానులు బారులు తీరారు. టికెట్ల విక్రయం కోసం ప్యారడైజ్ కూడలి నుంచి జింఖానా వరకు క్యూలైన్ ఏర్పాటు చేశారు. అంచనాలకు మించి రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో లాఠీచార్జ్ చేయడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 20 మందికి పైగా అభిమానులు స్పృహ తప్పి పడిపోయారు. మరికొంతమందికి అభిమానులతోపాటు 10మందికి పైగా పోలీసులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
మొదటి నుంచి గందరగోళమే
టికెట్ల విక్రయానికి సంబంధించి మొదటి నుంచి తీవ్ర గందరగోళం కొనసాగుతూనే ఉంది. మ్యాచ్ జరగాల్సిన డేట్ దగ్గరికి వస్తున్నప్పటికీ ఆన్లైన్, ఆఫ్లైన్ లో టికెట్లు అంటూ హెచ్సీఏ దేనిపైనా క్లారిటీ ఇవ్వలేదు. దీంతో హెచ్సీఏ తీరుపై అభిమానులు నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం 10 గంటల నుంచి జింఖానా గ్రౌండ్లో టికెట్లు అందుబాటులో ఉంటాయని హెచ్సీఏ అధ్యక్షుడు అజాహరుద్దీన్ ప్రకటించారు.