ఉక్రెయిన్పై సైనిక దాడి చేస్తామని రష్యా ప్రకటించడంతో బంగారం ధరకు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి. గ్లోబల్ మార్కెట్లో పసిడి రేటు భారీగా పెరిగింది. మన దేశంలో కూడా బంగారం ధర కొండెక్కింది. ఈ ఏడాదిలో గరిష్ట స్థాయికి చేరింది. గురువారం భారత్లో 10 గ్రాముల బంగారం ధర 51 వేల మార్కును తాకింది. మల్టీ కమొడిటీ ఎక్స్చేంజ్ మార్కెట్లో (ఎంసీఎక్స్)లో పసిడి విలువ 2.02 శాతం పెరిగి రూ.51,396కి చేరింది. వెండి ధరలో కూడా రెండు శాతం పెరుగుదల నమోదైంది. దాంతో కిలోకు దాని విలువ రూ.65,876కు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం పరుగులు పెట్టింది. పసిడి రేటు ఔన్స్కు ఏకంగా 1950 స్థాయికి ర్యాలీ చేసింది. ఇది 13 నెలల గరిష్ట స్థాయి అని చెప్పుకోవచ్చు. రానున్న రోజుల్లో పసిడి రేటు ఔన్స్కు 1980 డాలర్లు, 2 వేల డాలర్లకు కూడా చేరొచ్చనే అంచనాలు నెలకొన్నాయి. మరో పక్క ఉక్రెయిన్ సంక్షోభం కారణంగా స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. ముడి చమురు, డాలర్ విలువ పెరుగుతున్నాయి. మన స్టాక్ మార్కెట్లు యుద్ధ భీతితో కొట్టుమిట్టాడుతున్నాయి.