దేశంలో తొలి మంకీపాక్స్ కేసు నమోదైన నేపథ్యంలో కేంద్రప్రభుత్వం అప్రమత్తమైంది. దీనిపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అత్యున్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించింది. కేంద్ర బృందాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో వైద్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సలహాదారు డాక్టర్ పీ రవీంద్రన్, ఎన్సీడీసీ జాయింట్ డైరెక్టర్ సంకేత్ కులకర్ణి, రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రి డిపార్ట్మెంట్ ఆఫ్ మైక్రోబయాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ అరవింద్ కుమార్ అచార, డెర్మటాలజిస్ట్ డాక్టర్ అఖిలేష్ థోలెను ఇందులో సభ్యులుగా నియమించింది.
మార్గదర్శకాలు జారీ..
మంకీపాక్స్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి ఉద్దేశించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రత్యేకించి విమాన ప్రయాణికులపై ఆంక్షలను విధించింది.విదేశాల్లో ఉన్నప్పుడు రోగులు, ముఖ్యంగా చర్మ సంబంధ వ్యాధులు, జననేంద్రియ వ్యాధులతో బాధపడుతోన్న వారికి దూరంగా ఉండాలి.
అక్కడ చనిపోయిన లేదా బతికున్న ఎలుకలు, ఉడతలు, కోతులు, చింపాజీలను నేరుగా తాకకూడదు.ఆఫ్రికాకు చెందిన అడవి జంతువుల మాంసంతో తయారుచేసిన ఆహారపదార్థాలు, ఇతర ఉత్పత్తులను ఉపయోగించకూడదు.
రోగులు ఉపయోగించిన దుస్తులు, పడక, ఇతర వస్తువులను ఉపయోగించకూడదు.
దీంతోపాటు పలు సూచనలు కూడా చేసింది. మీరున్న ప్రాంతంలో మంకీపాక్స్ కేసులు నమోదైనా, లేదా మంకీపాక్స్ లక్షణాలతో ఉన్న వ్యక్తులతో సన్నిహితంగా మెలిగినా , ఈ వైరస్ లక్షణాలు కన్పించిన వెంటనే సమీపంలోని ఆరోగ్య కేంద్రానికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టంచేసింది. మరోవైపు మంకీపాక్స్ కేసులను నిర్ధారించేందుకు 15 వైరస్ రిసెర్చ్ అండ్ డయోగ్నోటిక్ లాబరేటరీస్ సిద్ధంగా ఉన్నట్లు ఐసీఎంఆర్ శుక్రవారం వెల్లడిరచింది.
ఈ మహమ్మారి తొలి కేసు కేరళలో వెలుగులోకి వచ్చింది. ఈ నెల 12వ తేదీన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి నుంచి తిరువనంతపురానికి చేరుకున్న 35 సంవత్సరాల వ్యక్తిలో మంకీపాక్స్ లక్షణాలు కనిపించాయి. కొల్లంకు చెందిన ఆ వ్యక్తికి నమూనాలను పుణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపించగా- పాజిటివ్గా నిర్దారణ అయినట్లు కేరళ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ చెప్పారు.