శాంతిని జీర్ణించుకోలేకపోతోంది
బీజేపీపై రాజస్థాన్ సీఎం గెహ్లాట్ విమర్శలు
ఉదయ్పూర్: రాజస్థాన్లో మతహింసపై ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో హింసను బీజేపీ ఉద్దేశపూర్వకంగా రెచ్చగొడుతోందని విమర్శించారు. రాష్ట్రం ప్రశాంతంగా ఉండటాన్ని కాషాయపార్టీ భరించలేకపోతోందని మండిపడ్డారు. బీజేపీ అధిష్ఠానం ఆదేశాల మేరకు అల్లర్లను ప్రోత్సహిస్తోందని, అంతిమంగా రాష్ట్రంలో అస్థిరత సృష్టించాలని ఉబలాటపడుతోందని గెహ్లాట్ బుధవారం చెప్పారు. బీజేపీ నాయకులు లక్ష్యంగా ముఖ్యమంత్రి విమర్శలు గుప్పించారు. శాంతియుత వాతావరణాన్ని భరించలేకనే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేసేందుకు కమలనాథులు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఏప్రిల్ 2వ తేదీ నుంచి రాష్ట్రంలోని జోథ్పూర్, అల్వార్, కరౌలీ వంటి అనేక ప్రాంతాల్లో జరుగుతున్న మత ఘర్షణలకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రతిపక్ష బీజేపీ నిరంతరం విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో గెహ్లాట్ పైవిధంగా స్పందించారు. ‘బీజేపీ నిరాశా, నిస్పృహలతో కొట్టుమిట్టాడుతోంది. అందువల్ల ఆ పార్టీ నాయకులు ఘర్షణలను ప్రోత్సహిస్తున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సవాయ్ మాధోపూర్ వచ్చివెళ్లినప్పుడే నేను చెప్పాను. ఆయన వచ్చి అగ్గి రాజేసి వెళ్లారు. ఇక హింస జరుగుతుందని చెప్పాను. కరౌలీలో హింస చెలరేగింది’ అని అశోక్ గెహ్లాట్ ఉదయ్పూర్లో విలేకరులతో చెప్పారు. ఏప్రిల్ 2వ తేదీన హిందూ సంస్థలు ముస్లింలు ఆధిపత్యం గల ప్రాంతంలో బైక్ర్యాలీ చేస్తుండగా రాళ్ల దాడి జరిగింది. దీంతో అక్కడ హింస చెలరేగిన విషయం విదితమే. జోథ్పూర్లో మత ఉద్రిక్తతల గురించి ప్రస్తావిస్తూ అక్కడ ఎలాంటి సమస్య లేకుండానే అల్లర్లు చెలరేగేలా చేశారని అశోక్ గెహ్లాట్ కమలం పార్టీ నేతలను నిందించారు. రాష్ట్రం శాంతియుతంగా ఉండటాన్ని బీజేపీ జీర్ణించుకోలేకపోతోందని విమర్శించారు. రాజస్థాన్ ప్రభుత్వాన్ని అపఖ్యాతిపాలు చేయాలని, అస్థిరత సృష్టించాలని అధిష్ఠానం నుంచి ఆదేశాలు రావడం, ఇక్కడ మతోన్మాదులు అల్లర్లు సృష్టించడం సర్వసాధారమైందని నిందించారు. ఆక్రమణల తొలగింపులో భాగంగా అల్వార్లోని రాజ్గఢ్లో రెండు దేవాలయాలు కూల్చివేసినట్లు రాష్ట్ర ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని, వాస్తవంగా ఆలయాల కూల్చివేతకు సంబంధించి బీజేపీ పాలనలోని నగరపాలక సంస్థ తీర్మానం చేసిందని గెహ్లాట్ వివరించారు. నగరపాలక సంస్థలో 35 మంది కౌన్సిలర్లకుగాను 34 మంది బీజేపీ నాయకులే ఉన్నారని చెప్పారు. శ్రీరామనవమి సందర్భంగా దేశంలోని ఏడు రాష్ట్రాల్లో అల్లర్లు జరగగా రాజస్థాన్లో శాంతియుత వాతావరణం ఉందని గుర్తుచేశారు. ‘అక్కడ పేదల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చివేశారు. మధ్యప్రదేశ్, దిల్లీల్లో ఇదే జరిగింది. కానీ ఇక్కడ మాత్రం ప్రశాంతంగా ఉంది. దీనిని బీజేపీ జీర్ణించుకోలేకపోయింది’ అని సీఎం మండిపడ్డారు.