జస్టిస్ రమణ పదవీకాలం ఏడాది పూర్తి
కీలక సంస్కరణలకు శ్రీకారం
న్యాయమూర్తుల నియామకంపై ప్రత్యేక దృష్టి
న్యూదిల్లీ: భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)గా జస్టిస్ ఎన్వీ రమణ బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయింది. 2021 ఏప్రిల్ 24న ఆయన సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణం చేశారు. ఏడాదిలో అనేక కీలక కేసులను విచారించారు. ముఖ్యమైన తీర్పులు వెలువరించారు. న్యాయవ్యవస్థలో సంస్కరణల కోసం ప్రయత్నించారు. ప్రజల న్యాయమూర్తిగా గుర్తింపుపొందారు. చట్టం, రాజ్యాంగానికి సంబంధించి ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎత్తిచూపారు. న్యాయవ్యవస్థలో మార్పు కోసం అనేక ప్రతిపాదనలు చేశారు. కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందరికీ సత్వర న్యాయమే లక్ష్యంగా ప్రయత్నించారు. అయినప్పటికీ రాజ్యాంగబద్ధమైన అనేక వ్యవహారాలు ఆయన వద్ద ఇంకా పెండిరగ్లోనే ఉన్నాయి. జస్టిస్ రమణ బాధ్యతలు చేపట్టిన తర్వాత సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో న్యాయమూర్తుల ఖాళీలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారు. గతంలో ఏ సీజేఐ చేయని విధంగా న్యాయమూర్తుల నియామకానికి పెద్దపీట వేశారు. ముగ్గురు మహిళలు సహా తొమ్మిది మందిని ఒకేసారి సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించారు. కొలీజియం సిఫార్సులు కేంద్ర ప్రభుత్వానికి పంపడం, వాటిని కేంద్రం ఆమోదించడం చకచకా జరిగాయి. దేశవ్యాప్తంగా 200 మందిని హైకోర్టు న్యాయమూర్తులుగా సిఫార్సు చేయగా 126మందికి కేంద్రం ఆమోదం తెలిపింది. ఇవన్నీ సీజేఐ రమణ ఏడాదికాలంలో చేపట్టిన సానుకూల చర్యలు. ఇంకా 422 రాజ్యాంగబద్ధమైన కీలక అంశాలు పెండిరగ్లో ఉన్నట్లు సుప్రీంకోర్టు వెబ్సైట్ పేర్కొంది. వీటిలో 52 ప్రధాన అంశాలు కాగా మరో 370 వాటి అనుబంధ వ్యవహారాలని తెలిపింది. మరో నాలుగు నెలల్లో సీజేఐగా జస్టిస్ రమణ పదవీకాలం ముగియనుంది. ఈ లోగా పెండిరగ్ వ్యవహారాలన్నీ పరిష్కారమవుతాయా అన్నది ప్రశ్నార్థకమే.
సీజేఐ రమణ విచారించిన కీలక కేసులు కొన్ని…
దేశద్రోహం కేసు: ఐపీసీలోని సెక్షన్ 124ఎ (దేశద్రోహం) చట్టబద్ధతను సవాల్ చేస్తూ రిటైర్డ్ మేజర్ జనరల్ ఎస్జీ వోంబట్కేరే ఫిర్యాదు చేశారు. వాక్స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛను ఈ సెక్షన్ అతిక్రమిస్తోందని పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై సీజేఐ రమణ ఆందోళన వ్యక్తంచేశారు. చట్టం అమలులో జవాబుదారీతనం లేక ఇది దుర్వినియోగమవుతోందని వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారం ఇంకా కోర్టు పరిశీలనలో ఉంది.
త్రిపుర హింస: 2021 అక్టోబరులో త్రిపురలో సామాజిక మాధ్యమాల్లో పోస్టుల నేపథ్యంలో అల్లర్లు జరిగాయి. చట్టవిరుద్ధ కార్యకలాపాల (నియంత్రణ) చట్టం కింద జర్నలిస్టు సహా ఇద్దరు న్యాయవాదులపై కేసు నమోదు అయింది. వారికి అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ సీజేఐ రమణ ఆదేశాలిచ్చారు.
లఖింపూర్ఖేరి: లఖింపూర్ ఖేరి కేసులో కేంద్రమంత్రి అజయ్ మిశ్రా తనయుడు ఆశీశ్ మిశ్రాకు అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన బెయిల్ను సీజేఐ రమణ ధర్మాసనం ఇటీవలి రద్దు చేసింది. బాధితుల వాదనను సరిగ్గా వినలేదని, అలహాబాద్ హైకోర్టు ఈ వ్యవహారంలో తొందరపాటు ప్రదర్శించిందని అభిప్రాయపడిరది. బెయిల్ కోసం అర్జీ పెట్టుకునే అవకాశాన్ని కల్పిస్తూ కేసును తిరిగి హైకోర్టుకు బదిలీ చేసింది.
పెండిరగ్ కేసులు అనేకం…
సీఏఏ చట్టం: 2019 డిసెంబరులో పౌరసత్వ (సవరణ) చట్టం ఆమోదం పొందింది. పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ దేశాలకు చెందిన ముస్లిం మినహా మైనారిటీలు భారత పౌరసత్వం పొందే వెసులుబాటు ఈ చట్టం కల్పిస్తుంది. ముస్లింలకు భారత పౌరసత్వం రద్దు చేసేందుకు బీజేపీ చేసిన కుట్రగా సీఏఏను దేశప్రజలు భావించిన క్రమంలో తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో 150 పిటిషన్లు దాఖలయ్యాయి. 2019 డిసెంబరులోనే సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసిందిగానీ..దీనిపై తాత్కాలిక ఉపశమనం ఇచ్చేందుకు నిరాకరించింది. రెండేళ్లుగా కేసు పెండిరగ్లోనే ఉంది.
అధికరణ 370: 2019 ఆగస్టులో జమ్మూకశ్మీర్ ప్రత్యేక రాష్ట్ర హోదాను ఎత్తివేసేందుకు అధికరణలు 370, 35ఏలను కేంద్రం రద్దు చేసింది. దీనిని సవాల్ చేస్తూ 2019 ఆగస్టు 9న సుప్రీంకోర్టులో మొదటిసారి పిటిషన్ దాఖలైంది. అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ నజీర్లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఆగస్టు 28న ఈ కేసును విచారించి ఆపై ఐదుగురి సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి సిఫార్సు చేసింది. దీనిని ఏడుగురు సభ్యుల ధర్మాసనానికి సిఫార్సు చేయాలని భావించినప్పటికీ ఆ అవసరం లేదని 2020లో ఐదుగురి సభ్యుల ధర్మాసనం పేర్కొంది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఈ వ్యవహారం పెండిరగ్లో ఉండగా సీజేఐ రమణ దీనిని ఇటీవలి విచారించారు. ఏప్రిల్ 25న దీనిపై సీజేఐ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట సీనియర్ న్యాయవాది శేఖర్ నాఫడే ఉంచారు. ఎన్నికల బాండ్లు, కర్ణాటకలో హిజాబ్ వివాదం, మణిపూర్లో సైన్యం, అసోం రైఫిల్స్, పోలీసులు సాగించిన హత్యాకాండ వంటి అనేక కేసులు సుప్రీంకోర్టులో పెండిరగ్లో ఉన్నాయి.