దేశంలో క్రిప్టో కరెన్సీ మార్కెట్పై అన్చితి కొనసాగుతోన్న నేపథ్యంలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఈ కరెన్సీ వినియోగంపై కీలక వ్యాఖ్యలు చేశారు. డిజిటల్ కరెన్సీ వల్ల మనీల్యాండరింగ్, టెర్రర్ ఫైనాన్సింగ్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న సీతారామన్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్లో జరిగిన సెమీనార్లో మాట్లాడారు.‘క్రిప్టోలతో అన్ని దేశాలకు ఉన్న అతిపెద్ద ముప్పు ఇదే..మనీలాండరింగ్, ఉగ్రవాదానికి ఆర్థికసాయం చేయడానికి ఈ కరెన్సీని ఉపయోగించే అవకాశాలున్నాయి.’ అని అన్నారు. ఈ సమస్య పరిష్కారానికి సాంకేతికతతో కూడిన నియంత్రణ అవసరమని భావిస్తున్నట్లు చెప్పారు. అయితే ఇది ఏ ఒక్క దేశమో నిర్వహించడం అనేది అసాధ్యం. బోర్డులోని అన్ని దేశాలు సమన్వయం చేసుకోవాలని అన్నారు. ఐఎంఎఫ్ డైరక్టర్ క్రిస్టలీనా జార్జీవా నేతృత్వంలో జరిగిన ఉన్నత స్థాయి ప్యానెల్ డిస్కషన్లో మంత్రి పాల్గొన్నారు. భారత్లో కోవిడ్ వేళ డిజిటల్ లావాదేవీలపై ఆధారపడ్డ వారి సంఖ్య గణనీయంగా పెరిగినట్లు సీతారామన్ చెప్పారు. డిజిటల్ లావాదేవీలను భారతీయులు త్వరగా దత్తత తీసుకున్నట్లు ఆమె తెలిపారు. దానికి సంబంధించిన డేటాను కూడా ఆమె ప్రజెంట్ చేశారు. ఏప్రిల్ 24వ తేదీన శాన్ ఫ్రాన్సిస్కోలో వ్యాపారవేత్తలతో మంత్రి సీతారామన్ చర్చించనున్నారు.