Friday, April 19, 2024
Friday, April 19, 2024

మరో ఏడాది సున్నా వడ్డీ

కొత్తగా పులివెందుల, కొత్తపేటలో ఆర్డీ కేంద్రాలు
12 పోలీసు సబ్‌డివిజన్లు, 16 పోలీస్‌ సర్కిళ్ల ఏర్పాటు
ప్రభుత్వ వైద్యుల ప్రైవేటు ప్రాక్టీస్‌పై నిషేధం
చిరుధాన్యాల సాగును ప్రోత్సహిస్తూ మిల్లెట్‌ మిషన్‌ పాలసీ
జిల్లా పరిషత్‌లను మిగిలిన కాలానికి కొనసాగిస్తూ ఆర్డినెన్స్‌
రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: నవరత్నాలు అమల్లో భాగంగా ‘సున్నా వడ్డీ’ పథకం మూడో ఏడాది కూడా కొనసాగించేందుకు రూ.1259 కోట్లు చెల్లించడానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఏప్రిల్‌ 22న సున్నా వడ్డీ పథకం కింద నగదు విడుదల చేయడానికి అంగీకరించింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అర్హులైన స్వయం సహాయక సంఘాలకు వైఎస్సార్‌ సున్నావడ్డీ పథకం అమలవుతోంది. రెండు సంవత్సరాలుగా ఈ పథకం అమలవుతుండగా మరో ఏడాది పొడిగించాలని కేబినెట్‌ నిర్ణయించింది. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా జరిగిన జిల్లాల పునర్విభజన ప్రక్రియను ప్రణాళికా శాఖ కార్యదర్శి విజయకుమార్‌ సహా అధికారులందరూ సమర్ధవంతంగా నిర్వహించారని మంత్రిమండలి ప్రశంసించింది. ఆ మేరకు అధికారులను అభినందిస్తూ సమావేశం తీర్మానం చేసింది. రాష్ట్రంలో కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేస్తూ గతంలో ఇచ్చిన నోటిఫికేషన్‌కు చేసిన స్వల్ప సవరణలకు, కొత్తగా కొత్తపేట, పులివెందుల రెవెన్యూ డివిజన్‌ల ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఆత్రేయపురం, ఆలమూరు, రావులపాలెం, కొత్తపేట, పి.గన్నవరం, అంబాజీపేట, అయినవిల్లితో కలిపి ఏడు మండలాలతో కొత్తపేట రెవెన్యూ డివిజన్‌, చక్రాయపేట, వేంపల్లె, సింహాద్రిపురం, లింగాల, పులివెందుల, వేముల, తొండూరు, వీరపునాయనిపల్లెలతో కూడిన 8 మండలాలతో పులివెందుల డివిజన్‌ ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఇటీవల జరిగిన జిల్లా విభజన ప్రక్రియ తర్వాత కూడా వైఎస్సార్‌ కడప జిల్లాలో 36 మండలాలుండటంతో కొత్తగా పులివెందుల డివిజన్‌ ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొత్తగా మరో 12 పోలీసు సబ్‌డివిజన్లు, 16 పోలీస్‌ సర్కిళ్ల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. చిరుధాన్యాల సాగును ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన మిల్లెట్‌మిషన్‌ పాలసీకి (2022-23 నుంచి 2026-27 వరకూ) కేబినెట్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. పంచాయతీరాజ్‌ చట్టానికి సంబంధించిన ఆర్డినెన్స్‌కు, జిల్లాల విభజనతో ఇప్పుడున్న జిల్లా పరిషత్‌లను మిగిలిన కాలానికి కొనసాగించాలని తీర్మానం చేసింది. ప్రభుత్వ వైద్యుల ప్రైవేటు ప్రాక్టీస్‌పై నిషేధం విధిస్తూ తీర్మానించింది. కేబినెట్‌ నిర్ణయాలను సమాచారశాఖ మంత్రి పేర్ని నాని మీడియాకు వెల్లడిరచారు.
వివిధ సంస్థల్లో పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్‌
చిత్తూరు జిల్లా పుంగనూరు మండలంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న అగ్రికల్చరల్‌ పాలిటెక్నిక్‌ కళాశాలలో 12 పోస్టుల భర్తీకి ఆమోదం తెలుపుతూ, ఐచ్ఛికంగా వచ్చిన ఎయిడెడ్‌ డిగ్రీకాలేజీల సిబ్బందికి ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో పోస్టులు ఇవ్వాలని సమావేశం తీర్మానించింది. ప్రకాశం జిల్లా దర్శిలో కొత్తగా ఏర్పాటుచేసిన ప్రభుత్వ డిగ్రీకాలేజీలో 24 టీచింగ్‌ పోస్టులు, 10 నాన్‌టీచింగ్‌ పోస్టులు, శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస తొగరాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 24 టీచింగ్‌, 10 నాన్‌ టీచింగ్‌ పోస్టుల మంజూరుకు, పీఆర్సీకి సంబంధించి ఆర్థికశాఖ జారీచేసిన ఉత్తర్వులకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.
భూముల కేటాయింపులు
ఆరోగ్యరంగాన్ని బలోపేతం చేసే దిశగా జిల్లా కేంద్రాలు, కార్పొరేషన్లలో అత్యాధునిక వైద్యసేవలు అందించనున్న ఆస్పత్రులకు భూములు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. కాకినాడ అర్బన్‌ మండలం సూర్యారావుపేటలో మల్టీ/సూపర్‌ స్పెషాల్టీ ఆస్పత్రి ఏర్పాటుకుగాను ఐదు ఎకరాల భూమిని కేటాయించింది. కర్నూలు జిల్లా కల్లూరు గ్రామంలో అత్యాధునిక ఆస్పత్రి కోసం ఐదు ఎకరాల భూమి, విజయనగరం మండలం సంతపేటలో 4.5 ఎకరాల భూమి హెల్త్‌ హబ్‌ కింద అత్యాధునిక ఆస్పత్రికి

ఏపీఐఐసీ ద్వారా కేటాయించాలని నిర్ణయించింది. అనంతపురం రూరల్‌లో 4 ఎకరాల భూమి హెల్త్‌ హబ్‌ కింద ఏర్పాటయ్యే ఆస్పత్రికి, శ్రీకాకుళం మండలం పాత్రునివలసలో 4.32 ఎకరాల భూమిని హెల్త్‌ హబ్‌ కింద ఏర్పాటయ్యే అత్యాధునిక ఆస్పత్రికి కేటాయించేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.
ఇవిగాక కన్వెన్షన్‌ సెంటర్‌ కోసం రాజమండ్రి అర్బన్‌లో 6 ఎకరాల భూమి, కర్నూలు జిల్లా బేతంచర్లలో ఎంఎస్‌ఎంఈ పార్కు ఏర్పాటుకు ఏపీఐఐసీకి 100 ఎకరాలు, కొయ్యూరు మండలం బలరాం గ్రామంలో ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ ఏర్పాటుకు 15.31 ఎకరాలు, ప్రభుత్వ ఐటీఐకు హుకుంపేట మండలం గడుగుపల్లిలో 5.10 ఎకరాల భూమి, అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం కడమలకుంట, రాగులపాడుల్లో 15 ఎకరాల భూమి ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌కు, కర్నూలు జిల్లా డోన్‌ మండలం ఉడుములపాడులో ఆగ్రోకెమికల్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ విస్తరణకు 10.06 ఎకరాలు, కాకినాడ జిల్లా జగ్గంపేటలో బస్‌స్టేషన్‌ నిర్మాణానికి 1.57 ఎకరాల భూమి, రంపచోడవరం మండలం పెదగడ్డాడలో ఏకలవ్య మోడల్‌ స్కూల్‌ నిర్మాణానికి 15 ఎకరాల భూమి, నిజాంపట్నం మండలం దిండిలోని పరిసవారిపాలెంలో 280 ఎకరాలు ఏపీ మత్స్యశాఖకు, కర్నూలు జిల్లా కొలిమిగుండ్లలో ఏపీఐఐసీ ఇండస్ట్రియల్‌ పార్కు ఏర్పాటుకు 82.34 ఎకరాల భూమి, ముత్తుకూరు మండలం ఈపూరు సమీపంలో ఇండస్ట్రియల్‌ పార్కు నిర్మాణానికి ఏపీఐఐసీకి 84.29 ఎకరాలు, గూడూరులో ప్రభుత్వ ఆస్పత్రి విస్తరణ కోసం 0.89 ఎకరాలు, నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కాన్పూరులో 5.05 ఎకరాల భూమిని సెంట్రల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియన్‌ లాంగ్వేజెస్‌కు కేటాయిస్తూ కేబినెట్‌ తీర్మానించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img