. విజయనగరంలో ప్రభుత్వ కళాశాల
. 150 సీట్లకు అనుమతిస్తూ ఎన్ఎంసీ ఉత్తర్వులు
. ఈ విద్యా సంవత్సరం నుంచే తరగతులు ప్రారంభం
. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని వెల్లడి
విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: రాష్ట్రానికి మరో కొత్త ప్రభుత్వ వైద్య కళాశాల మంజూరైనట్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని మంగళవారం తెలిపారు. విజయనగరంలో ఈ ఏడాది నుంచి ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రారంభించేందుకు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) అనుమతులు మంజూరు చేసిందని వెల్లడిరచారు. ఈ నెల మూడో తేదీన ఎన్ఎంసీ విజయనగరం ప్రభుత్వ వైద్య కళాశాలలలో తనిఖీలు నిర్వహించిందని చెప్పారు. ఆ సమయంలో అక్కడి నిర్మాణాలు, బోధన, బోధనేతర సిబ్బంది, వసతులు, ల్యాబ్లు, లైబ్రరీ, హాస్టళ్లు, ఆస్పత్రి, బోధనా సిబ్బంది అనుభవం, వారి పబ్లికేషన్లు, అందుబాటులో ఉన్న నర్సింగ్, పారామెడికల్ సిబ్బంది ఇలా అన్ని అంశాలను ఎన్ఎంసీ క్షుణ్ణంగా పరిశీలించిందని వివరించారు. ప్రభుత్వం సమకూర్చిన వసతులు, సిబ్బంది నియామకాలతో సహా అన్ని అంశాలపై సంతృప్తి చెందిన ఎన్ఎంసీ…ఈ ఏడాది నుంచే తరగతులు నిర్వహించుకోవడానికి అనుమతులు మంజూరు చేసిందని వివరించారు. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వానికి ఉత్తర్వులు అందాయని మంత్రి రజిని చెప్పారు. ఈ కాలేజీకి మొత్తం 150 సీట్లు మంజూరు చేసిందన్నారు. రాష్ట్రంలో రూ.8500 కోట్లతో మొత్తం 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలల నిర్మాణాన్ని జగనన్న చేపట్టారని మంత్రి తెలిపారు. వీటిలో తొలిసారిగా ఉత్తరాంధ్రకు చెందిన విజయనగరం కళాశాలకు అనుమతులు రావడం గర్వకారణమని పేర్కొన్నారు. ఈ విద్యాసంవత్సరం నుంచే రాష్ట్రంలో మరో నాలుగు ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రారంభించాలనే దృఢ నిశ్చయంతో ప్రభుత్వం ముందుకు వెళుతోందని పేర్కొన్నారు. మచిలీపట్టణం, ఏలూరు, విజయనగరం, నంద్యాల, రాజమండ్రిల్లోనూ వైద్య కళాశాలలు ప్రారంభమయ్యేలా ఇప్పటికే అన్ని వసతులు సమకూర్చుతున్నామన్నారు. పీజీ సీట్లను గణనీయంగా పెంచుకునే విషయంలోనూ కృషి చేస్తున్నామని, గతంలో 911 పీజీ సీట్లు ఉండగా, ప్రస్తుతం 1249కి పెరిగాయని తెలిపారు.