Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

మరో నాలుగు నెలల్లో జనాభాలో చైనాను మించిపోనున్న భారత్‌

ప్రపంచ దేశాల్లో జనాభా ఎక్కువగా ఉన్న దేశం ఏదంటే చైనా అని వెంటనే చెబుతుంటారు.. కానీ త్వరలోనే చైనా స్థానంలో భారత్‌ అని జవాబు చెప్పాల్సి వస్తుందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. మరో నాలుగు నెలల్లో.. అంటే 2023 ఏప్రిల్‌ నాటికి జనాభాలో మన దేశం ప్రపంచంలోనే మొదటిస్థానంలో ఉంటుందని పేర్కొంటున్నాయి. చైనా జనాభా ప్రస్తుతం సుమారు 145 కోట్లు కాగా మన దేశ జనాభా 141 కోట్లుగా ఉంది. ఇటీవలి కాలంలో చైనాలో జననాల సంఖ్య పడిపోయింది. గతేడాది కేవలం 1.6 కోట్ల జననాలు మాత్రమే నమోదయ్యాయి. చైనాలో మరణాల సంఖ్యతో పోలిస్తే ఇది పెద్ద సంఖ్య కాదని నిపుణులు చెబుతున్నారు. 1983లో చైనా జనాభా వృద్ధి రేటు 2 శాతంగా ఉండగా, ప్రస్తుతం 1.1 శాతం ఉంది. అంటే, జననాల రేటు దాదాపు సగానికి పడిపోయింది. జననాల సంఖ్య పడిపోవడంతో చైనా ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. దీనివల్ల యువత జనాభా తగ్గి వృద్ధుల సంఖ్య ఎక్కువవుతోందని కలవరపడుతోంది.ఇటు భారత్‌లోనూ అదే పరిస్థితి. 1950లో భారత సంతానోత్పత్తి రేటు సగటున 5.7 శాతంగా ఉండగా, అది ఇప్పుడు రెండుకు తగ్గింది. అయితే, సగటు ఆయుర్దాయం పెరగడంతో మరణాల సంఖ్య జననాలతో పోలిస్తే తక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు. మరణాల రేటు తగ్గిపోవడం, ఆయుర్దాయం పెరగడంతో జనాభా పెరుగుదల నిలకడగా ఉందంటున్నారు.1947లో భారతదేశ ప్రజల సగటు వయస్సు 21 సంవత్సరాలు. అప్పుటి జనాభాలో 60 ఏళ్ల పైబడిన వారు కేవలం 5 శాతం మంది మాత్రమే. కానీ ఇప్పుడు భారత దేశ ప్రజల సగటు వయసు 28 సంవత్సరాల పైనే ఉంది. 60 ఏళ్లు దాటిన వారి సంఖ్య 10 శాతంగా ఉంది. అయితే, ప్రపంచంలో యువత ఎక్కువగా ఉన్న దేశాల్లో మన దేశం కూడా ఉంది. మన దేశ జనాభాలో 47 శాతం 25 ఏళ్లలోపు వారే ఉన్నారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img