భారీ వర్షాలు పడే అవకాశం
వాతావరణ శాఖ హెచ్చరిక
వరుసగా నాలుగు రోజులుంటాయని వెల్లడి
విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: ఒకపక్క గోదావరి నదికి పెద్దఎత్తున వరదలు, మరోపక్క భారీ వర్షాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ మరో నాలుగు రోజుల పాటు వరుసగా భారీ వర్షాలుం టాయని చేసిన హెచ్చరిక బెంబేలెత్తిస్తోంది. శనివారం నుంచి నాలుగు రోజుల పాటు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, దక్షిణ కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిక జారీ చేసింది. కోస్తా జిల్లాల్లో, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నివేదిక పేర్కొంది. సగటు సముద్ర మట్టం వద్ద రుతుపవనాల ద్రోణి ఇప్పుడు గంగానగర్, రోప్ాతక్, గ్వాలియర్, సిధి, అంబికాపూర్, సంబల్పూర్, బాలాసోర్ మీదుగా ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం సముద్ర మట్టం వరకు వెళ్లి సగటున 0.9 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉందని ఐఎండీ అమరావతి శాస్త్రవేత్త సగిలి కరుణ సాగర్ తెలిపారు. గడచిన 24 గంటల్లో అమరావతిలో అత్యధికంగా 63మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, నందిగామలో 41మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల ఉష్ణోగ్రతలు 4 నుంచి 7 డిగ్రీల సెల్సియస్కు పడిపోయాయి. బాపట్లలో 7 డిగ్రీల సెల్సియస్ ఉండగా కనిష్ట ఉష్ణోగ్రత సగటున 27.4 డిగ్రీలుగా నమోదైంది. శుక్రవారం ఉదయం నుంచి ఏపీలోని చాలా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం జార్ఖండ్, ఉత్తర ఒడిశా, పొరుగు ప్రాంతాలపై ఈ తుపాను ప్రభావం ఉంది. సముద్ర మట్టానికి 5.8 కి.మీ వరకు విస్తరించి, ఎత్తుతో నైరుతి వైపునకు వంగి ఉంటుంది. భారీ వర్షాల కురుస్తున్న క్రమంలో ప్రజలు అనవసరంగా బయటికి వెళ్లరాదని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.