. పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం
. మూడు నెలల గరిష్టానికి చేరిక
న్యూదిల్లీ : రిటైల్ ద్రవ్యోల్బణం మరోసారి పెరిగింది. 2023 తొలి నెల జనవరిలోనే అధికమైంది. గత ఏడాది డిసెంబర్తో పోలిస్తే ఏకంగా 0.80 శాతం పెరిగి మూడు నెలల గరిష్టానికి చేరింది. దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం మరోసారి భారత రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) పరిమితిని మరోసారి మించిపోయింది. వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం ఈ ఏడాది జవనరిలో 6.52 శాతానికి పెరిగింది. గత డిసెంబర్లో ఇది 5.72 శాతంగా నమోదుగా కాగా.. జనవరిలో 0.80 శాతం అధికమైంది. ఈ గణాంకాలను సోమవారం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఆహార పదార్థాల ధరల పెరుగుదలతో ఆహార ద్రవ్యోల్బణం 5.94 శాతానికి దూసుకెళ్లిందని, అందువల్లే రిటైల్ ద్రవ్యోల్బణం పెరిగిందని ప్రభుత్వ గణాంకాలు తెలిపాయి. రిటైల్ ద్రవ్యోల్బణంలో ఆహార పదార్థాలు దాదాపు 40 శాతం వాటా కలిగి ఉంటాయి. నిత్యావసరాలు, ఆహార పదార్థాలు, కూరగాయాల ధరలను ఈ రిటైల్ ద్రవ్యోల్బణం సూచిస్తుంది. అంటే గతేడాది డిసెంబర్తో పోలిస్తే జనవరిలో దేశంలో ధరలు పెరిగినట్టు లెక్క. కూరగాయల ధరలు గత డిసెంబర్లో 11.70 శాతం నమోదు కాగా, గత నెలలో 15.08 శాతానికి పరిమితం అయ్యాయి. ఆయిల్ అండ్ లైట్ ద్రవ్యోల్బణం స్వల్పంగా 10.97 నుంచి 10.84 శాతానికి పడిపోయింది. తృణ ధాన్యాల ధరలు 13.79 శాతం నుంచి 16.12 శాతానికి పెరిగాయి. రెండు నెలల పాటు తగ్గుముఖం పట్టిన రిటైల్ ద్రవ్యోల్బణం… 2023 తొలి నెలలోనే ఎగిసింది. రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 4 శాతం నుంచి 6 శాతం మధ్య ఉంచాలని ఆర్బీఐ లక్ష్యంగా పెట్టుకుంది. 10 నెలల తర్వాత గతేడాది నవంబర్లో ద్రవ్యోల్బణం 5.88 శాతానికి దిగివచ్చింది. డిసెంబర్లో 5.72 శాతానికి చేరింది. అయితే మించిపోయింది. ద్రవ్యోల్బణం పెరుగుదలతో రెపో రేటును రానున్న కాలంలోనూ ఆర్బీఐ మరింత పెంచే అవకాశాలు ఉంటాయి. ఇటీవలే రెపో రేటును 25 బేసిస్ పాయింట్ల (0.25శాతం) మేర పెంచింది ఆర్బీఐ. వరుసగా ఆరోసారి రెపో రేటును అధికం చేసింది. దీంతో రెపో రేటు
మొత్తంగా 6.25 శాతానికి చేరింది.
ఏప్రిల్లో మళ్లీ వడ్డీరేట్ల పెంపు?
రిటైల్ ద్రవ్యోల్బణంపై హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రిన్సిపల్ ఎకనమిస్ట్ సాక్షి గుప్తా స్పందించారు. ‘కీలక ద్రవ్యోల్బణం సంక్లిష్టంగా ఉంది. దీనికితోడు గోధుమలతోపాటు ప్రోటీన్ ఆహార పదార్థాల ధరలు పెరగడం వల్లే జనవరి రిటైల్ ద్రవ్యోల్బణం శరవేగంగా 6.52 శాతానికి పెరిగింది. అంతకు ముందు రెండు నెలలు (నవంబర్, డిసెంబర్) ద్రవ్యోల్బణం స్వల్పంగా దిగి వచ్చినా.. అది విస్తృత ప్రాతిపదికన కాదని తేలింది. కీలక ద్రవ్యోల్బణం ఇంకా ఆందోళనకరంగానే ఉందంటూ గతవారం 25 బేసిక్ పాయింట్లు రెపోరేట్ను ఆర్బీఐ పెంచేసింది. తాజా పరిణామాలు మరో దఫా ఏప్రిల్లో వడ్డీరేట్ల పెంపు తప్పక పోవచ్చు. బాండ్ల ధరలు 7.4 శాతాన్ని దాటొచ్చు’ అని అభిప్రాయ పడ్డారు.