రూ.1,000 కోట్ల ఆస్తుల జప్తు…
మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఎన్సీపీ సీనియర్ నేత అజిత్పవార్కు ఆదాయ పన్ను (ఐటీ) శాఖ భారీ షాకిచ్చింది. ఆయనకు, ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించిన దాదాపు రూ.1,000 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసినట్లు ఆదాయపు పన్ను శాఖ అధికారులు మంగళవారం ప్రకటించారు. దిల్లీ, మహారాష్ట్ర, గోవాలలో ఈ ఆస్తులు ఉన్నాయని తెలిపారు. ఇందులో అజిత్ పవార్ కుటుంబానికి చెందిన కో`ఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. గత నెలలో నిర్వహించిన సోదాల్లో లెక్కల్లో చూపని రూ.184 కోట్ల ఆదాయాన్ని గుర్తించినట్లు తెలిపారు.అనంతరం ఈ చర్య తీసుకున్నట్లు పేర్కొన్నారు. గత నెలలో అజిత్ పవార్ సోదరీమణులకు చెందిన ఇళ్ళు, సంస్థలపై ఐటీ శాఖ సోదాలు జరిగాయి. ఈ సోదాలపై అజిత్ పవార్ స్పందిస్తూ, ఈ సంస్థలన్నీ క్రమబద్ధంగా పన్నులు చెల్లిస్తున్నాయని తెలిపారు. తాను ఆర్థిక మంత్రినైనందున తనకు ఆర్థిక క్రమశిక్షణ బాగా తెలుసునన్నారు. దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. తన సోదరీమణులకు సుమారు 35 సంవత్సరాల క్రితం వివాహమైందని, వారి ఇళ్ళు, సంస్థలపై కూడా సోదాలు జరగడం బాధాకరమని పేర్కొన్నారు.