ఎన్ఎఫ్ఐడబ్ల్యూ ప్రధాన కార్యదర్శి అనీరాజా డిమాండు
దిల్లీలో మూడు రోజుల దీక్ష ప్రారంభం
న్యూదిల్లీ : చట్టసభల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించాలని భారత జాతీయ మహిళా సమాఖ్య (ఎన్ఎఫ్ఐడబ్ల్యూ) జాతీయ సమితి కేంద్రాన్ని డిమాండు చేసింది. ఇందుకు సంబంధించిన బిల్లును ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో ఆమోదించాలని డిమాండు చేస్తూ దిల్లీలో మూడు రోజుల పాటు నిరసన దీక్ష కార్యక్రమాన్ని చేపట్టింది. సోమవారం ప్రారంభమైన నిరసన దీక్షా శిబిరంలో ఎన్ఎఫ్ఐడబ్ల్యూ ప్రధాన కార్యదర్శి అనీరాజా ప్రసంగించారు. చట్టసభల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పనకు సంబంధించిన బిల్లు చాలా కాలంగా ఆమోదానికి నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యసభలో ఈ బిల్లు 2010 మార్చి 9నే ఆమోదం పొందినా లోక్సభలో ఓటింగ్కే నోచుకో లేదని గుర్తు చేశారు.
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ఈ బిల్లును ఆమోదించే బలం ఉన్నా పట్టీపట్టనట్టు వ్యవహరిస్తోందని విమర్శించారు. ఇప్పటికైనా సమాజంలో సగ భాగమైన మహిళలకు సంబంధించిన ఈ బిల్లును పార్లమెంటు ప్రస్తుత సమావేశాల్లో ఆమోదింప చేసి దేశ వ్యాప్తంగా అమలు చేయాలని డిమాండు చేశారు. ఈ నిరసన శిబిరంలో సమాఖ్య ఉపాధ్యక్షులు నిశా సిద్దు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు వి జయలక్ష్మి తదితరులు ప్రసంగిస్తూ మహిళలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్ల అవసరాన్ని వివరించారు.
ఈ దీక్షలకు ఏపీ నుంచి పంచదార్ల దుర్గాంబ, పమిడిముక్కల రాణి, నదియా తదితరులు ప్రతినిధులుగా పాల్గొని జాతీయ స్థాయి ఉద్యమానికి సంఫీుభావం ప్రకటించారు.