కొత్త సంవత్సరం వేళ శనివారం తెల్లవారుజామున జమ్మూకశ్మీరులోని వైష్ణోదేవి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. జమ్మూ కశ్మీర్లోని రియాసి జిల్లా కత్రాలోని మాతా వైష్ణోదేవి మందిరంలో శనివారం తెల్లవారుజామున జరిగిన తొక్కిసలాటలో 12 మంది మరణించగా 13 మంది గాయపడ్డారు.క్షతగాత్రులను త్వరితగతిన ఆసుపత్రికి తరలించారు.ఈ విషయాన్ని అదనపు డైరక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు ముకేశ్ సింగ్ ధ్రువీకరించారు. క్షతగాత్రులను పోలీసులు స్థానిక ఆసుపత్రి తరలించారు. మృతులు దిల్లీ, హరియాణా, పంజాబ్, జమ్మూకశ్మీర్ వాసులుగా గుర్తించారు. తెల్లవారుజామున 2.45 గంటల సమయంలో ఘటన జరిగింది. ఘటనాస్థలిలో సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. ఆలయంలోకి చాలామంది భక్తులు పర్మిషన్ స్లిప్ లేకుండా ప్రవేశించడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్థారణకు వచ్చారు. ఈ ఘటనపై లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తీవ్ర విచారం వ్యక్తంచేశారు. పరిస్థితిపై ఎప్పటికప్పుడు అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు.మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, గాయాలైన వారికి రూ.2 లక్షల పరిహారం ప్రకటించారు.
ప్రధాని మోదీ సంతాపం
ఈ ఘటనపై ప్రధాని మోదీ విచారం వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతులక కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి`పీఎంఎన్ఆర్ఎఫ్ తరపున రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు
రాహుల్గాంధీ సంతాపం
‘వైష్ణో దేవి ఆలయంలో జరిగిన ఘటన బాధాకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా.’ అంటూ ఘటనపై రాహుల్ తీవ్ర విచారం వ్యక్తంచేశారు.