తెలంగాణ`బీజాపూర్ సరిహద్దుల్లో ఎదురుకాల్పులు
విశాలాంధ్రచింతూరు(అల్లూరిజిల్లా): తెలంగాణ
బీజాపూర్ సరిహద్దుల్లో ఎన్కౌంటర్ జరిగింది. తెలంగాణ గ్రేహౌండ్స్, సీఆర్పీఎఫ్ కోబ్రా సంయుక్తంగా చేపట్టిన గాలింపులో మావోయిస్టులకు భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. భీకర పోరులో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా మృతి చెందినట్లు తెలుస్తోంది. హిడ్మాపై రూ.45 లక్షల రివార్డు ఉంది. హిడ్మా ఎన్కౌంటర్ను మావోయిస్టు కేంద్ర కమిటీ ధ్రువీకరించలేదు. కేంద్ర కమిటీ సభ్యుడిగా హిడ్మా ఉన్నందున ఆయనకు నాలుగంచెల భద్రత ఉంటుంది. దండకారణ్యంలో జరిగే ప్రతి దాడి వెనుక హిడ్మా హస్తం ఉంటుందని నిఘా వర్గాలు చెబుతున్నాయి. చత్తీస్గఢ్ రాష్ట్రంలోని బస్తర్ జిల్లా పూవర్తిలోని ఆదివాసీ కుటుంబంలో జన్మించిన హిడ్డాకు బస్తర్, సుక్మా, దంతేవాడ, బీజాపూర్ ప్రాంతాల్లో మంచి పట్టుంది. దండకారణ్యంలోని ఆదివాసీలతో సత్సంబంధాలు ఉన్నాయి. హిడ్మా(38)కు మావోయిస్టుల్లో మాస్టర్మైండ్గా గుర్తింపు ఉంది. 17ఏళ్ల వయస్సులోనే అప్పటి పీపుల్స్వార్లో చేరి మిలిటెంట్గా, బస్తర్ కమాండర్గా ఎదిగిన హిడ్మా… పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్జీఏ)లో కీలక నాయకుడయ్యాడు. ఈ దళంలో 180 నుంచి 250 మంది ఉన్నట్లు తెలుస్తోంది. హిడ్మా ఫిలిప్పీన్స్లో శిక్షణ పొందినట్లు సమాచారం. మావోయిస్టు పార్టీ చత్తీస్గఢ్ సౌత్ సబ్ జోనల్ కమాండర్గా పనిచేశాడు. ప్రస్తుతం దండకారణ్యం ప్రత్యేకజోన్ కమిటీ సభ్యుడిగా, మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నాడు. చదివింది ఏడో తరగతే అయినాగానీ ఆంగ్లం, గిరిజన మాండలికాలతో సహా అనేక భాషలలో నిష్ణాతుడు. 21 మంది సభ్యులు ఉన్న మావోయిస్టు కేంద్ర కమిటీలో అతిపిన్న వయస్కుడు కూడా ఈయనే. సంతోశ్ అనే మారుపేరు కూడా హిడ్మాకున్నది. హిడ్మా 2010లో జరిగిన తాడిమెట్ల మెరుపు దాడి సూత్రధారి. ఈ దాడిలో 24 మంది జవాన్లు మృతి చెందారు. 2013లో జీరామ్ ఘాటి వద్ద కాంగ్రెస్ నేతల ఊచకోతలోనూ హిడ్మా కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు గుర్తించారు. 2017 ఏప్రిల్లో సుక్మా జిల్లాలో 27 మంది సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడి భద్రత దళాలకు భారీ ఎదురుదెబ్బగా మిగిలింది. 2021 ఏప్రిల్ 4న బీజాపూర్ జిల్లా తరెంలో హిడ్మా వ్యూహంలో చిక్కుకున్న 22మంది బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్ సిబ్బంది మృతి చెందారు. ఇలాంటి కనీసం 26 దాడుల్లో హిడ్మా కీలకంగా వ్యవహరించినట్లు తెలంగాణ పోలీసులు తెలిపారు.