సీఎం జగన్కు చంద్రబాబు సెల్ఫీ సవాల్
విశాలాంధ్ర బ్యూరో – నెల్లూరు : ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి శుక్రవారం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సెల్ఫీ సవాల్ విసిరారు. నెల్లూరు పట్టణ శివారులో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కట్టిన వేలాది టిడ్కో ఇళ్ల సముదాయం వద్ద చంద్రబాబు సెల్ఫీ దిగి… ఇవి మేం కట్టిన ఇళ్లు అంటూ ట్వీట్ చేశారు. చూడు… జగన్! ఇవే మా ప్రభుత్వ హయాంలో పేదలకు నాడు నెల్లూరులో కట్టిన వేలాది టిడ్కో ఇళ్లు… రాష్ట్రంలో నాడు కట్టిన లక్షల టిడ్కో ఇళ్లకు ఇవే సజీవ సాక్ష్యం. ఈ నాలుగేళ్లలో నువ్వు కట్టిన ఇళ్లెన్ని… నువ్వు కట్టిన ఇళ్లెక్కడ… జవాబు చెప్పగలవా? అంటూ జగన్కు ట్యాగ్ చేస్తూ సెల్ఫీ ఫొటోతో చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. తన మొబైల్ ఫోన్తో స్వయంగా నెల్లూరు టిడ్కో ఇళ్ల సముదాయం వద్ద సెల్ఫీ దిగి సవాల్ విసిరారు. రాష్ట్రంలో నాటి అభివృద్ధి పనులపై ప్రభుత్వానికి సెల్ఫీ ఛాలెంజ్ చేయాలని ఇప్పటికే పార్టీ నాయకులకు, కార్యకర్తలకు చంద్రబాబు నాయుడు పిలుపు ఇచ్చారు. నాడు చేసిన అభివృద్ధి పనులతో పాటు నేడు ఉన్న సమస్యలను చాటి చెప్పేలా సెల్ఫీలు తీసి ఛాలెంజ్ విసరాలని కోరారు.