పారాలింపిక్ బృందంతో ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్రమోదీ ఇవాళ భారత పారాలింపిక్ బృందంతో భేటీ అయ్యారు. ఈ నెల 24 నుంచి వచ్చే నెల 5 వరకు జరుగనున్న పారా ఒలింపిక్స్ కోసం భారత దేశం నుంచి 54 మంది అథ్లెట్ల బృందం జపాన్ బయలుదేరనుంది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ వారితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషించారు. పారా అథ్లెట్లు జపాన్లో మరోసారి సత్తా చాటాలని ఆయన ఆకాంక్షించారు.కరోనా మహమ్మారి మీ కష్టాలను రెట్టింపు చేసింది. అయినా మీరు మీ ఆటలను, సాధనను వదులుకోలేదు. అసలైన క్రీడాకారులకు ఉండాల్సిన లక్షణం ఇదే అని ప్రధాని వ్యాఖ్యానించారు. పారాలింపిక్స్లో మీ విజయాలు, మీరు సాధించబోయే పతకాలు దేశానికి ఎంతో ముఖ్యం. అయితే ఈ నవభారత్ పతకాలు సాధించుకు రావాలంటూ మీపై ఎప్పుడూ ఒత్తిడి చేయదు. ముందుగా మీరు మీ ప్రతిభను నూటికి నూరు శాతం ప్రదర్శించండి. పతకం వస్తుందా.. రాదా.. అనేది తర్వాత విషయం అని వారికి భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా గుజరాత్కు చెందిన పారా-బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పారుల్ దల్సుఖ్భాయ్ పార్మర్తో ప్రధాని మాట్లాడుతూ, మీకు మరో రెండేండ్లలో 50 ఏండ్ల వయసులో అడుగపెట్టబోతున్నారు. ఇప్పటిదాకా మీరు మీ ఫిట్నెస్ను కాపాడుకోవడం కోసం చాలా కష్టపడారని అన్నారు. ఈ రాఖీ పండుగకు మీరు తప్పకుండా మీ సోదరుడికి బహుమతి ఇస్తారని అనుకుంటున్నా అని ప్రధాని దల్సుఖ్భాయ్ పార్మర్తో వ్యాఖ్యానించారు.