యూపీ ప్రభుత్వానికిసుప్రీం నోటీసు
రేపటికి విచారణ వాయిదా
ఆలోగా అఫిడవిట్ దాఖలుకు ఆదేశం
దేశంలో కొవిడ్ ఉధృతి కొనసాగుతుంటే మతపరమైన కార్యక్రమాన్ని ఎలా అనుమతిస్తారని కేంద్రంతో పాటు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలను సుప్రీంకోర్టు బుధవారం నిలదీసింది. ఈ నెల 25 నుంచి కన్వర్ యాత్రను చేపట్టేందుకు ఉత్తరప్రదేశ్లోని యోగి ప్రభుత్వం ఆదేశాలు జారీచేయడాన్ని సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. ఇది ఆందోళన కలిగించే నిర్ణయమని పేర్కొంది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్ నేతృత్వంలోని ధర్మాసనం నోటీసులను జారీచేసింది. కొవిడ్ ఉధృతి వేళ రెప్పపాటు నిర్లక్ష్యం కూడా ప్రాణాంతకమేనన్న ప్రధాని మోదీ ప్రకటనను ప్రస్తావిస్తూ తాజా పరిణామాలను ప్రశ్నించింది. కన్వర్ యాత్రకు అనుమతి ఇవ్వడంపై కేంద్రంతో పాటు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలు తమ వైఖరిని తెలియజేయాలని సూచించింది. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసిన న్యాయస్థానం ఆలోగా సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో స్పష్టంచేసింది. కన్వర్ యాత్రను ప్రారంభిస్తున్నట్లు వచ్చిన వార్తలను సుమోటోగా స్వీకరించి తాజా ఉత్తర్వులను సర్వోన్నత న్యాయస్థానం జారీచేసింది. ఉత్తర్వుల ప్రతిని భారత ప్రధాన న్యాయమూర్తికి పంపాలని రిజిస్ట్రీకి సూచించింది. భారత ప్రభుత్వ కార్యదర్శి, ఉత్తరాఖండ్` ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు శుక్రవారం ఉదాయానికి అఫిడవిట్లు సమర్పించాలని ఆదేశాలిచ్చింది.