భారత వాతావరణశాఖ హెచ్చరిక
న్యూదిల్లీ : రాబోయే మూడు రోజుల్లో దేశంలోని 20 రాష్ట్రాల్లో భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ(ఐఎండీ) సోమవారం అంచనా వేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల రాబోయే రెండు, మూడు రోజుల్లో వాయువ్య, ఈశాన్య, ద్వీపకల్పంలోని అనేక రాష్ట్రాల్లో భారీవర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ బులెటిన్ పేర్కొంది. అక్టోబరు 18 నుంచి 20 తేదీల మధ్య నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, అసోం, అరుణాచల్ప్రదేశ్, మేఘాలయ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు, భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఈ నెల 18, 19తేదీల్లో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి భారీవర్షాలు కురవవచ్చని ఐఎండీ అధికారులు హెచ్చరించారు. అల్పపీడన ప్రభావం దక్షిణ తూర్పు ద్వీపకల్పంపై చూపిస్తుందని, దీనివల్ల కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ రాష్ట్రాల్లోనూ భారీవర్షాలు కురవవచ్చని వాతావరణశాఖ వివరించింది. కేరళ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి లలో విస్తారంగా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. బంగాళాఖాతం నుంచి బలమైన గాలులు వీస్తున్నందున తూర్పు భారతదేశంలో అక్టోబరు 20 వరకు భారీ వర్షపాతం కొనసాగుతుందని అధికారులు వెల్లడిరచారు. జార్ఖండ్, బీహార్, పశ్చిమబెంగాల్, ఒడిశా, సిక్కింలలో భారీవర్షాలు కురుస్తాయని తెలిపారు. అక్టోబరు 18 నుంచి 20తేదీల మధ్య పశ్చిమబెంగాల్, సిక్కిం, ఒడిశాలలో ఓ మోస్తరు నుంచి భారీవర్షాలు కురవవచ్చని అధికారులు చెప్పారు. ఉత్తరప్రదేశ్, హరియాణా, చండీగఢ్లలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు.