Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

మూలపేట పోర్టుకు నేడు శంకుస్థాపన

. హాజరుకానున్న సీఎం జగన్‌
. తొలి దశలో రూ.3 వేల కోట్లతో నాలుగు బెర్తుల నిర్మాణం
. 23.5 మిలియన్‌ టన్నుల హ్యాండ్లింగ్‌ సామర్థ్యం
. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఇదొక చారిత్రక ఘట్టం
. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌

విశాలాంధ్ర బ్యూరో – విశాఖపట్నం : ఉత్తరాంధ్రలో ఒక చారిత్రక ఘట్టానికి అంకురార్పణ జరగబోతోందని, శ్రీకాకుళం జిల్లా మూలపేట వద్ద రూ.3 వేల కోట్ల వ్యయంతో చేపట్టనున్న పోర్టు నిర్మాణానికి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి బుధవారం శంకుస్థాపన చేయనున్నారని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ తెలిపారు. రాష్ట్రంలో పూర్తిగా వెనుకబడిన ప్రాంతమైన శ్రీకాకుళం జిల్లా పారిశ్రామికంగా, ఆర్థికంగా పరిపుష్టి చెందాలన్న సంకల్పంతో సీఎం జగన్‌ తీసుకున్న అనేక నిర్ణయాలు ఇప్పుడు సఫలీకృతం కాబోతున్నాయని అన్నారు. ఇందులో భాగంగానే మూలపేట పోర్టు నిర్మాణానికి అంకురార్పణ జరగబోతోందని తెలిపారు. మంగళవారం స్థానిక సర్క్యూట్‌ హౌస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ భావనపాడు పోర్టు నిర్మిస్తామని చెప్పి గత ప్రభుత్వం ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలను, ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా వాసులను మోసం చేసిందని, కానీ జగన్‌మోహన్‌ రెడ్డి ఆ విధంగా చేయలేదని, ఎన్నికల సమయంలో శ్రీకాకుళం జిల్లాలో పోర్టు నిర్మిస్తామని ఇచ్చిన హామీని వాస్తవ రూపంలో తీసుకువచ్చేందుకు అడుగులు ముందుకు వేస్తున్నారని తెలిపారు. ఈ మూలపేట పోర్టులో తొలి దశలో 23.5 మిలియన్‌ టన్నుల హ్యాండ్లింగ్‌ సామర్థ్యం కలిగిన నాలుగు బెర్తులను నిర్మిస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఉన్న సముద్ర తీరాన్ని, వనరులను సద్వినియోగం చేసుకుంటామని సీఎం జగన్‌ అనేక సందర్భాల్లో చెప్పారని, అందులో భాగంగానే మారిటైం బోర్డు సహకారంతో మూలపేట పోర్టు నిర్మాణాన్ని చేపడుతున్నామని చెప్పారు. బందరు, రామాయపట్నం పోర్టుల నిర్మాణాన్ని మరింత వేగవంతం చేసి, రామాయపట్నం పోర్టుకు ఈ ఏడాది డిసెంబరు లేదా వచ్చే ఏడాది జనవరిలో తొలి వెసెల్‌ వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. అలాగే జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణ పనులు పూర్తికావస్తున్నాయని, శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లకు చెందిన బుడగట్లపాలెంలో రూ.170 కోట్లతో మరొక ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మించనున్నామని మంత్రి వివరించారు. మూలపేట పోర్టు, ఆరు వరుసల రహదారి నిర్మాణం పూర్తయితే శ్రీకాకుళం జిల్లా పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందుతుందని అమర్‌నాథ్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే మే 3న సుమారు 3,500 కోట్ల రూపాయలతో నిర్మించనున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరు కావలసిందిగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియాను ఆహ్వానించామన్నారు. 2025 తొలి అంకంలో మొదటి విమానం భోగాపురం విమానాశ్రయంలో ల్యాండ్‌ అవుతుందని మంత్రి అమర్‌నాథ్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో వైద్య కళాశాలలు నిర్మిస్తున్నామని, ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేశామని అన్నారు. గత ప్రభుత్వం ఈ ప్రాంతానికి ఎప్పుడైనా ఇంత మేలు చేసిందా అని ఆయన ప్రశ్నించారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, మూలపాడు పోర్టు నిర్మాణం పూర్తయితే చత్తీస్‌గఢ్‌, ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి ఖనిజాలు, గ్రానైట్స్‌, వివిధ రకాల ఉత్పత్తులు దేశ, విదేశాలకు ఎగుమతి చేయడానికి ఎంతగానో ఉపకరిస్తుందని చెప్పారు. జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం సంక్షేమ పథకాలకు అధిక మొత్తాన్ని వెచ్చించి, అభివృద్ధిని విస్మరించిందని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు శ్రీకాకుళం జిల్లాలో చేపడుతున్న విస్తృత అభివృద్ధి కార్యక్రమాలతో చెక్‌ చెప్పనున్నామని అమర్‌నాథ్‌ అన్నారు. ఇటీవల విశాఖలో జరిగిన పారిశ్రామిక సదస్సులో ఎంవోయూలు ఒక్కటొక్కటిగా కార్యరూపం దాలుస్తున్నాయని చెప్పారు. ఇప్పటికే 99 వాణిజ్య సంస్థలు రాష్ట్రంలో పరిశ్రమలను ఏర్పాటు చేసుకునేందుకు ముందుకు వచ్చాయని, ప్రస్తుతం ఇవి స్థల పరిశీలనలో ఉన్నాయని, దీనికి సంబంధించి చీఫ్‌ సెక్రటరీ అధ్వర్యంలో ప్రభుత్వం వేసిన రెండు కమిటీలు అధ్యయనం చేస్తున్నాయని మంత్రి వివరించారు. రామాయపట్నం పోర్టుకు సమీపంలో 3,500 ఎకరాల భూమిని పారిశ్రామిక అవసరాల కోసం సిద్ధం చేశామని, అలాగే మూలపేట వద్ద ఉన్న కేంద్ర ప్రభుత్వ భూములను కూడా రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించమని కోరామన్నారు. ఏది ఏమైనా మూలపేట పోర్టు, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంతో ఉత్తరాంధ్ర ముఖచిత్రం మారబోతుందని ఆయన స్పష్టం చేశారు.
విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను కేంద్ర ప్రభుత్వమే నడపాలి
విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు సంబంధించి విలేకరులు అడిగిన ప్రశ్నకు మంత్రి అమర్‌నాథ్‌ సమాధానం చెబుతూ విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ కేంద్ర ప్రభుత్వ సంస్థగానే ఉండాలని అన్నారు. ప్లాంట్‌ను ముక్క ముక్కలు చేసి విక్రయించడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను విరమించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వ పాలసీలో భాగంగా విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ను విక్రయిస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందని, నష్టాల్లో ఉన్న అనేక పరిశ్రమలను కేంద్రం ఇప్పటికీ నడుపుతోందని, అటువంటప్పుడు విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను నడపడానికి ఎందుకు వెనకాడుతోందని ప్రశ్నించారు. 32 మంది ప్రాణ త్యాగంతో సాధించుకున్న విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరించడానికి కేంద్రం, దాన్ని కొంటామంటూ తెలంగాణ ప్రభుత్వం రోజుకో మాటతో విశాఖపట్నం వచ్చి అలజడి సృష్టిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరించకూడదన్నది తమ ప్రభుత్వ అభిమతమని, ప్లాంట్‌ ప్రైవేటీకరణను నిరసిస్తూ కార్మికులు చేపడుతున్న ఉద్యమాలకు రాష్ట్ర ప్రభుత్వం దన్నుగా నిలుస్తుందని అమర్‌నాథ్‌ స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img