తాము ఏదైనా మ్యానిఫెస్టోలో చేర్చామంటే అది గ్యారంటీ.. కేవలం హామీ కాదు అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ చెప్పారు. వచ్చే ఏడాది ప్రారంభంలో గోవా అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో రాహుల్గాంధీ గోవా పర్యటనకు వెళ్లారు. వెల్సావోలో స్థానిక మత్స్యకారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంలో రాహుల్ మాట్లాడుతూ, తమ పార్టీ అధికారంలోకి వస్తే సమస్యలు తీరుస్తుందని చెప్పారు. ‘మేం చత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేశాం..గెలిపిస్తే వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చాం. మ్యానిఫెస్టోలో చేర్చాం. గెలిచాం.. వ్యవసాయ రుణాలు మాఫీ చేశాం’ అని అన్నారు. చత్తీస్గఢ్ మాత్రమే కాదు.. కావాలనుకుంటే పంజాబ్ రాష్ట్రాలకు కూడా వెళ్లి తాము మ్యానిఫెస్టోలో చేర్చిన హామీలను నెరవేర్చామో లేదో తెలుసుకోవచ్చని అన్నారు. తాము ఏదైనా మ్యానిఫెస్టోలో చేర్చామంటే అది గ్యారంటీ.. కేవలం హామీ కాదు అని రాహుల్గాంధీ చెప్పారు. గోవాను కలుషిత ప్రాంతం కానివ్వబోమని, బొగ్గు అడ్డాగా మారనివ్వమని రాహుల్ హామీ ఇచ్చారు. ప్రస్తుతం క్రూడాయిల్ ధరలు బాగా తగ్గాయని, అయినా ప్రభుత్వం అధిక పన్నులు విధించడంతో ధరలు భారీగా పెరిగాయని ఆరోపించారు. ప్రస్తుతం ప్రపంచంలో ఇంధనంపై అత్యధిక పన్నులు వసూలు చేస్తున్న దేశం భారత్ మాత్రమేనని అని అన్నారు.