. బహుముఖ రవాణా వ్యవస్థ దిశగా విశాఖ
. భారత్ అభివృద్ధిలో ఏపీ కీలక భూమిక
. విశాఖ సభలో ప్రధాని మోదీ
. రూ.10,742 కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు
విశాలాంధ్ర బ్యూరో`విశాఖ: ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రా ప్రజలు తమ ప్రతిభను చాటుతున్నారని… వైద్యం, వ్యాపారం, సాంకేతిక రంగాల్లో ఏపీ ప్రజలు రాణిస్తున్నారని ప్రధాని నరేంద్రమోదీ కొనియాడారు. విశాఖ పర్యటనలో భాగంగా ఏయూ ప్రాంగణంలోని ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో శనివారం నిర్వహించిన భారీ బహిరంగ సభలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రూ.10,742 కోట్ల విలువైన ప్రాజెక్టులను వర్చువల్ విధానంలో మోదీ ప్రారంభించారు. బహిరంగ సభ వేదిక వద్దకు చేరుకున్న మోదీకి గవర్నర్ హరిచందన్, సీఎం జగన్ స్వాగతం పలికారు. కేంద్ర రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ సభకు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మోదీని సీఎం జగన్ శాలువాతో సత్కరించారు. అనంతరం మోదీ తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. భారత్కు విశాఖ ప్రత్యేకమైన నగరమని, ప్రాచీన కాలం నుంచి విశాఖ పోర్టుకు ఘన చరిత్ర ఉందని, ఎన్నో ఏళ్లుగా ప్రముఖ వ్యాపార కేంద్రంగా విశాఖ వెలుగొందుతోందని గుర్తుచేశారు. వెయ్యేళ్ల క్రితమే పశ్చిమాసియా, రోమ్కు విశాఖ నుంచి వ్యాపారం జరిగేదని, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తనను కలిసినప్పుడల్లా ఏపీ అభివృద్ధి గురించే అడిగేవారని తెలిపారు. వికసించిన భారత్ అనే అభివృద్ధి మంత్రంతో భారత్ ముందుకెళ్తోందని మోదీ పేర్కొన్నారు. సమ్మిళిత అభివృద్ధే తమ ఆలోచన అని, మౌలిక సదుపాయాలతో ఆధునిక భారత్ను ఆవిష్కరిస్తున్నామన్నారు. రైల్వే, రోడ్లు, పోర్టుల అభివృద్ధి విషయంలో ఏమాత్రం వెనకడుగు వేయడం లేదని చెప్పారు. విశాఖ రైల్వే స్టేషన్తో పాటు పోర్టును ఆధునికీకరిస్తున్నామని, బహుముఖ రవాణా వ్యవస్థ దిశగా విశాఖ ముందడుగు వేస్తోందని తెలిపారు. మిషన్ గతిశక్తి కింద ప్రాజెక్టుల్లో వేగం పెంచామని, ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయని వివరించారు. సామాన్యుడిజీవితం మెరుగుపరచడమే తమ ప్రధాన లక్ష్యమని చెప్పుకున్నారు. ప్రతి దేశం ఏదో ఒక సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, అలాంటి దేశం భారత్ వైపు చూస్తోందన్నారు. పేదల శక్తి పెరగడం, ఆధునిక సాంకేతికత వారికి అందుబాటులోకి వచ్చిన నాడు వికసించిన భారత్ కల సాకారమవు తుందని మోదీ పేర్కొన్నారు. సముద్ర తీరాలు మన సమృద్ధికి ముఖ ద్వారాలుగా మారాయ న్నారు. భారత్ను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లడంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్య భూమిక పోషిస్తుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని మోదీ అన్నారు. పేద ప్రజలకు సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నామన్నారు. వెనుకబడిన జిల్లాల్లో అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని మోదీ వెల్లడిరచారు. రైతులకు కిసాన్ సమ్మాన్ నిధులు, పేదలకు ఉచిత రేషన్ అందిస్తున్నా మన్నారు. సన్రైజ్ సెక్టార్ ఆలోచన కారణంగా యువతకు కొత్త అవకాశాలు వస్తున్నాయన్నారు. సముద్ర వ్యాపారాలు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని ప్రధాని మోదీ వెల్లడిరచారు. ప్రతి రైతు ఖాతాలో ఏడాదికి 6 వేల రూపాయలు, డ్రోన్, గేమింగ్, అంకురాలకు సంబంధించిన నిబంధనలు సడలించడం వంటి అనేక దశలను మోదీ గుర్తుచేశారు. రూ.2,658 కోట్లతో శ్రీకాకుళం-అంగుల్ నేచురల్ గ్యాస్ పైపులైన్ (745కి.మీ.), రూ. 3,778 కోట్లతో రాయపూర్-విశాఖ ఎకనామిక్ కారిడార్లో 6 లేన్ల గ్రీన్ ఫీల్డ్ రహదారి, విశాఖ ఎన్హెచ్-516సిపై కాన్వెంట్ జంక్షన్-షీలానగర్ జంక్షన్ వరకు 6 లేన్లు, రూ.566 కోట్లతో విశాఖ పోర్టు కనెక్టివిటీ కోసం అదనంగా 4 లేన్ల డెడికేటెడ్ పోర్టు రోడ్డు, రూ.152 కోట్లతో విశాఖ ఫిషింగ్ హార్బర్ ఆధునికీకరణ, రూ.460 కోట్లతో విశాఖ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధికి ప్రధాని శంకుస్థాపన చేశారు. ఓఎన్జీసీ-యు ఫీల్డ్ ఆన్షోర్ సదుపాయాలు జాతికి అంకితం చేశారు.