మీర్జాపూర్ : యావత్ ప్రపంచం ప్రస్తుతం సున్నితమైన పరిస్థితులను ఎదుర్కొంటోందని ప్రధాని నరేంద్రమోదీ శుక్రవారం అన్నారు. సంక్షోభం ఎంతటిదైనాగానీ భారత్ ప్రతిస్పందన అంతకంటే పెద్దదన్నారు. ఆయన శుక్రవారం ఎన్నికల ర్యాలీలో మాట్లాడారు. ఉక్రెయిన్ నుంచి వేలాది మంది విద్యార్థులను ఆపరేషన్ గంగా కింద భారత్కు సురక్షితంగా చేర్చినట్లు వెల్లడిరచారు. ఇది ప్రపంచానికి చాలా సున్నితమైన కాలమని, చాలా దేశాలు మహమ్మారి కారణంగా తీవ్ర ఇబ్బంది పడ్డాయి. అనిశ్చితి, అస్థిరత నెలకొంది. మీరు గమనించి ఉంటారు సంక్షోభం ఎంత తీవ్రమైనదైనాగానీ భారత్ స్పందించిన తీరు దానిని తలదన్నేదిగా ఉన్నట్లు ఆయనన్నారు. ఉక్రెయిన్లో యుద్ధ పరిస్థితిని ప్రస్తావించారు. గంగమ్మతో ముడిపడినది ఏదైనాగానీ విజయవంతం కావాల్సిందేనన్నారు. కరోనా కాలంలో ఆపరేషన్ వందే భారత్, అఫ్ఘాన్లో ఆపరేషన్ దేవిశక్తి, ఉక్రెయిన్లోని విద్యార్థుల కోసం ఆపరేషన్ గంగాను చేపట్టామన్నారు. ప్రతిపక్షాన్ని లక్ష్యం చేసుకొన్న మోదీ వారిపై విమర్శలు గుప్పించారు. పరివార్వాదీలను, మాఫియావాదీలను ఉత్తరప్రదేశ్ ఓటర్లు ఓడిస్తారని, తిరిగి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని చెప్పారు. కుటుంబ రాజకీయాలు అంటూ విపక్షాలపై మండిపడ్డారు. ఆయా పార్టీల చరిత్రను తిరగేస్తే రాష్ట్రాన్ని లూటీ చేయడం, ఉగ్రవాదులకు విముక్తి కల్పించడం, అల్లరిమూకలకు సాయం అందించడం, మాఫియాను, నేరగాళ్లను స్తుతించడం కనిపిస్తుందని విమర్శించారు. అలాంటి వారి వల్ల దేశానికిగానీ ఉత్తరప్రదేశ్కుగానీ మంచి జరగదన్నారు. సమాజాన్ని ముక్కలు చేయడం, ప్రజలను విభజించి అధికారాన్ని చేజిక్కించుకొని యూపీని లూటీ చేయడమే విపక్షం పని అని, ఇటువంటి క్రీడ మీకు ఆమోదయోగ్యమా అని ర్యాలీని ప్రశ్నించారు. మీ ఓటుతో దేశం సామర్థ్యం పెరుగుతుందని, పటిష్ట యూపీ కల నెరవేరుతుందని అన్నారు. కోవిడ్ మహమ్మారి దాటికి బడా దేశాలు సైతం నిస్సహాయంగా ఉంటే భారత్ మాత్రం 80 కోట్ల మందికి ఉచిత రేషన్ అందించిందన్నారు.