Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

యూపీ ఎన్నికల్లో మహిళా శక్తి

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు ఈసారి అత్యంత ఆసక్తికరంగా మారాయి. ఎన్నికల కోసం అన్ని పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. విశేషమేమిటంటే ఈసారి ఎన్నికల్లో మహిళలు కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. రాష్ట్రంలోని ప్రధాన పార్టీల పగ్గాలు మహిళా నేతల చేతుల్లోనే ఉన్నాయి. బహుజన సమాజ్‌ పార్టీ(బీఎస్పీ) విషయానికి వస్తే మాయావతి అధినేత్రిగా మాజీ ముఖ్యమంత్రిగా రాజకీయంగా చెరగని ముద్ర వేసుకున్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మాయావతి మరోసారి తన పార్టీని అధికారంలోకి తీసుకురావాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. పాత నేతలంతా పార్టీని వీడినప్పటికీ సన్నద్ధతలో కొదవలేదు. ఈ ఎన్నికల్లో కొత్త నేతలను ముందుకు తెచ్చారు. మూడు సార్లు ముఖ్యమంత్రి అయిన మాయావతి ఏ రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకోలేదు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సతీష్‌ చంద్ర మిశ్రాతో పాటు పాత, కొత్త నేతలతో కలిసి పూర్తి ప్రణాళికతో ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇక కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రా ఈసారి రాష్ట్రంలో కాంగ్రెస్‌ ఎన్నికల బాధ్యతను పూర్తిగా తన భుజస్కందాలపై వేసుకున్నారు. పార్టీ ఎన్నికలకు సంబంధించిన ప్రతి నిర్ణయాన్ని ఆమె స్వయంగా తీసుకుంటున్నారు. లక్నోలోనే మకాం వేసిన ప్రియాంక నిత్యం నేతలందరికీ అందుబాటులో ఉంటున్నారు. ప్రియాంక రాకతో రాష్ట్ర పార్టీ నాయకులు ఉత్సాహంగా ఉన్నారు. చెల్లాచెదురైన చాలా మంది పాత నేతలు తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. విశేషమేమిటంటే.. ఈ ఎన్నికల్లో మహిళలకు అత్యధిక టిక్కెట్లు ఇస్తామని ప్రియాంక హామీ ఇచ్చి దానిని అమలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించిన కాంగ్రెస్‌… 40 శాతం మహిళలకు కేటాయించడం విశేషం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై నిత్యం విమర్శల దాడులు చేస్తున్నారు. ప్రజల నాడిని గమనించి పార్టీతో కలుపుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈమె పనితీరు రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్‌కు బలం చేకూరుస్తుందని భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంలో పరిశ్రమల శాఖ సహాయ మంత్రి, అప్నాదళ్‌ అధ్యక్షురాలు అనుప్రియా పటేల్‌, డాక్టర్‌ సోనెలాల్‌ పటేల్‌ మరణానంతరం రాజకీయాల్లో క్రియాశీలకంగా మారారు. అనుప్రియ తన పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో నిలకడగా విజయం సాధిస్తున్నారు. 2012లో తొలిసారిగా వారణాసిలోని రోహనియా నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014లో, ఎన్‌డీఏతో పొత్తు తర్వాత, ఆమె మీర్జాపూర్‌ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. అనంతరం కేంద్ర ప్రభుత్వంలో మంత్రి అయ్యారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి కింద 11 స్థానాల్లో పోటీ చేసి 9 మంది ఎమ్మెల్యేలను గెలుచుకోవడంలో విజయం సాధించింది. ప్రస్తుతం ఆమె పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు, 9 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ ఉన్నారు. అనుప్రియా పటేల్‌ పార్టీ ఎన్‌డీఏ కూటమిలో ఉంది. పూర్తి మెజారిటీతో తిరిగి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పరచడానికి అహోరాత్రులు శ్రమిస్తున్నారు. ఇక నాలుగో మహిళా నాయకురాలు సోనెలాల్‌ పటేల్‌ భార్య కృష్ణ పటేల్‌. అసలు పార్టీకి సంబంధించి వివాదాల తర్వాత కొత్త పార్టీ ఆప్నాదళ్‌ (కృష్ణగ్రూప్‌) పెట్టి రాజకీయం చేస్తున్నారు. ఆమెతో పాటు మరో కూతురు పల్లవి పటేల్‌ కూడా భుజం భుజం కలిపి నడుస్తోంది. కృష్ణపటేల్‌ శాసనసభ, ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసినా ఇంతవరకు విజయం సాధించలేదు. ఈసారి ఆమెపార్టీ ఎస్పీతో పొత్తు పెట్టుకుంది. ఎస్పీ పొత్తుతో కుర్మీ సమాజాన్ని కలుపుతూ ఓట్లు రాబట్టే పెద్ద బాధ్యతను పోషిస్తోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img